పవన్! పొలాలు, ఇళ్లు రాయించుకున్నారు: చిరంజీవి-అల్లు అరవింద్పై జూపూడి సంచలనం
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఏపీ టీడీపీ నేత, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర రావు మంగళవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా జనసేనాని సోదరుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవిని లాగారు.
చిరంజీవి అసలు ఏ పార్టీలో ఉన్నాడో కూడా ఎవరికీ అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. విభజన సమయంలో చిరంజీవి ఏం మాట్లాడకపోయారని ధ్వజమెత్తారు. ప్రజారాజ్యం పార్టీ యూత్ వింగ్ లీడర్గా ఉన్న పవన్ ఆనాడు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు.
ఎన్నికల సమయంలో చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ 2009లో పోటీ చేసిన అభ్యర్థుల నుంచి పొలాలు, స్థలాలు, ఇళ్లు రాయించుకొని రాజకీయాలను కలుషితం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారో ఎవరికీ అర్థం కాదని విమర్శించారు. ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతారన్నారు.
'లోకేష్ అంటే గజగజ, పవన్ కళ్యాణ్కు పెళ్లిళ్లపై అవగాహన లేదు'
తనకు ఐదుగురు ఎమ్మెల్యేలు ఉంటే అసెంబ్లీని వణికించేవాడినని ఓసారి చెబుతారని ఎద్దేవా చేశారు. పవన్ అన్న చిరంజీవి 2009లో 18 మంది ఎమ్మెల్యేలను తన పార్టీ తరఫున గెలిపించారని, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్రమంత్రి అయ్యారని, పవన్ కళ్యాణ్ కూడా ఐదుగురు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారా అన్నారు.
పవన్ కళ్యాణ్ పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జనసేన.. ప్రజారాజ్యం 2గా మారిందన్నారు. పీఆర్పీ అవశేషంగా జనసేనను ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. పవన్కు దగ్గరగా ఉన్న లోక్సత్తా జేపీ, కమ్యూనిస్టులు ఒక్కరొక్కరు ఆయనను వదిలేశారని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో పవన్ రంగ బయటపడుతుందని అన్నారు. ప్రజలు ఆయనకు గట్టి గుణపాఠం చెబుతారన్నారు. మొదట్లో కులమత బేధాలు లేవని చెప్పిన పవన్ ఇప్పుడు కాపు కులం అయినందునే చంద్రబాబు గౌరవించడం లేదని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఏపీని అన్నింటా మొదటిస్థానంలో నిలిపినందుకు చంద్రబాబుపై విమర్శలా అన్నారు.