పట్టి సీమకు హంద్రీనీవా మోటార్: ప్రాంతీయ విద్వేషాలని జూపూడి ఫైర్
అమరావతి: పట్టిసీమ ప్రాజెక్టుకు హంద్రీనీవా మోటారును తరలించారంటూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో వార్తాకథనం వచ్చింది. దీనిపై టిడిపి నాయకుడు జూపూడి ప్రభాకర్ తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు.
పట్టిసీమ ప్రాజెక్టుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోటార్లు తరలిస్తున్నారంటూ జగన్ సొంత పత్రికలో కథనాలు రాస్తూ ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టిస్తున్నారన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు వల్ల రాయలసీమకు అన్యాయం జరుగుతుందని తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా కథనాలు ప్రచురిస్తున్నారన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును అనుకున్న సమాయానికే పూర్తి చేసినందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు.
మంగళవారం సాక్షి పత్రికలో మరో 10 మోటార్ల తరలింపు? అంటూ ఓ కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. అందులో హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి పది మోటార్లను తరలించాలని ప్రభుత్వం యోచిస్తోందని అందులో పేర్కొంది. నిజానికి హంద్రీనీవా పంపుల పనులు చేసిన సంస్ధే ఇప్పుడు పట్టిసీమ పనులు కూడా చేపట్టింది.
దీంతో గుట్టుచప్పుడు కాకుండా హంద్రీనీవా మోటార్లను ట్రయల్ రన్ కోసమే తరలిస్తున్నామని చెబుతున్నారు. పట్టిసీమ కోసం ఆర్డర్ చేసిన పంపులు వచ్చేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉండటంతో అధికారులు మోటార్లను తరలించాలని అధికారులకు అనధికారకంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీటిని తరలించేందుకు అవసరమైన మోటార్లు ఇంకా సిద్ధం కాలేదు. దీంతో సదరు కాంట్రాక్ట్ ఏజెన్సీ హంద్రినీవా సుజల స్రవంతి పథకం-1 మాల్యాల లిఫ్ట్ నుంచి 6వ మోటారును రాత్రికి రాత్రే తరలించి అమర్చింది. రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్విచ్ ఆన్ చేసి ఈ పంపు ద్వారానే నీటిని విడుదల చేశారు.
పట్టిసీమకు అమర్చాల్సిన 24 మోటార్లు ఇంకా సిద్ధం కాలేదని తెలుస్తోంది. ఈ మోటార్ల తయారీ ఆర్డర్ బ్రెజిల్కు చెందిన ఓ కంపెనీకి ఇచ్చారు. అనుకున్న సమయానికి ఆ మోటర్లు రాలేదు. హంద్రినీవాలో మొత్తం 8 లిప్ట్లు ఉన్నాయి. ఒక్కో లిప్ట్లో 12 మోటార్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో లిప్ట్ నుంచి 2 మోటార్ల చొప్పున మొత్తం 5 లిప్ట్ల్లోని 10 మోటార్లను పట్టిసీమకు తరలించే యోచనలో అధికారులు ఉన్నారు.
అయితే హంద్రీనీవా నుంచి ఈ మోటార్లను తరలిస్తే సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని కొందరు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పట్టిసీమ ట్రయల్ రన్ కోసమే మోటార్లను తరలించినట్లు హంద్రీనీవాను పర్యవేక్షిస్తున్న ఇంజనీర్ తెలిపారు. కాగా, పట్టిసీమ పథకానికి హంద్రీనీవా మోటారును రాత్రికి రాత్రే తరలించడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐజయ్య తప్పుబట్టారు.