అనేక అంశాలు తెరపైకి: హోదాపై బిజెపికి జూపూడి, పక్కరాష్ట్రాలతో జగన్ దోస్తీ
హైదరాబాద్: ప్రత్యేక హోదా ఇవ్వకుంటే అనేక అంశాలు తెరపైకి వస్తాయని తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు శుక్రవారం నాడు భారతీయ జనతా పార్టీని హెచ్చరించారు. ప్రత్యేక హోదా పైన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ లోకసభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇది ఏపీవాసుల ఆశలపై నీళ్లు జల్లింది.
ఈ నేపథ్యంలో జూపూడి ప్రభాకర రావు స్పందించారు. ప్రత్యేక ప్యాకేజీతో ఆంధ్రప్రదేశ్ సంతృప్తి చెందలేదని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి లేదా అని ప్రశ్నించారు. హోదా విషయంలో టిడిపి ఎట్టి పరిస్థితుల్లోను రాజీపడదని తేల్చి చెప్పారు.
ప్రత్యేక హోదాను వ్యతిరేకిస్తున్న పక్క రాష్ట్రాలతో ప్రతిపక్షం చేతులు కలుపుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఓట్లు వేయలేదని కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాను వదిలేసినా టిడిపి మాత్రం వదిలే ప్రసక్తి లేదన్నారు.
ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీయే సీరియస్గా ఆలోచిస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. కేంద్రం ప్రకటనతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పండుగ చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా లేదంటే వెంటనే హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదే తరహా డిమాండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంటుందని హెచ్చరించారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదాకు ఓకే చెప్పిన బీజేపీ తన మాటను నిలబెట్టుకోవాలన్నారు. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదన్నారు.