ఆ లెక్క ఎవరిది: జగన్పై జూపూడి, మహానాడు కేటరర్స్కే అమరావతి కాంట్రాక్ట్, ఇవీ వంటకాలు..
అమరావతి: అమరావతి శంకుస్థాపనకు రాబోమని ప్రకటించిన వైయస్సార్ కాంగ్రస్, కాంగ్రెస్ పార్టీల పైన తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర రావు మంగళవారం మండిపడ్డారు. రెండు పార్టీలు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నాయని, వారి తీరు చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు.
అమరావతి శంకుస్థాపనకు రూ.400 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఎవరు చెప్పారన్నారు. కార్యక్రమం కోసం వేసిన రోడ్లు అతిథుల కోసం ఏర్పాటు చేసిన భోజనం పైన రాద్దాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు లెక్కలు అడిగే అర్హత వైసిపికి ఉందా అని నిలదీశారు.
మహానాడు క్యాటరర్స్కే భోజన కాంట్రాక్ట్
కొద్ది నెలల క్రితం టిడిపి మహానాడులో సుమారు 2లక్షల మందికి వండి వడ్డించిన కేటరింగ్ సంస్థకే అమరావతి శంకుస్థాపన నాడు అతిధులకు, భూములిచ్చిన రైతులకు, సాధారణ ప్రజలకు వండి వడ్డించే కాంట్రాక్టు లభించింది. అంబికా క్యాటరర్స్ ఈ రెండు కాంట్రాక్టులను దక్కించుకుంది.
అమరావతిలో జరుగుతున్న భోజన ఏర్పాట్ల గురించి సంస్థ ప్రతినిధి వివరించారు. మొత్తం మూడు విభాగాల్లో భోజన ఏర్పాట్లను చేస్తున్నామని, ప్రతి ఒక్కరికీ పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, తాపేశ్వరం కాజా ఉంటాయన్నారు.
భూములిచ్చిన రైతులకు వీటితో పాటు అర లీటర్ నీళ్ల బాటిల్, మజ్జిగ ప్యాకెట్ అదనంగా ఉంటాయని, సాధారణ ప్రజలకు వీటితో పాటు రెండు వాటర్ ప్యాకెట్లను అందిస్తామన్నారు. వీఐపీలకు, వీవీఐపీలకు విడిగా వంటలను చేస్తున్నట్లు చెప్పారు. ఉత్తరాది వంటకాలతో పాటు చైనీస్, అమెరికన్ వెరైటీలు అందిస్తున్నట్లు చెప్పారు.
మూడు విభాగాలుగా వంటలను విభజించామని 400 మందికి పైగా వంటవారిని, 200 మంది ప్యాకింగ్ బాయిస్ను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 1.60 లక్షల మందికి వంటలు వండిస్తున్నామని, 1.30 లక్షల ఆహార ప్యాకెట్లను తయారు చేస్తామన్నారు.
బుధవారం సాయంత్రం నుంచి మిఠాయిల తయారీ ప్రారంభం అవుతుందని, అనంతరం పులిహోర, దద్దోజనం తయారవుతాయన్నారు. ఆహార పదార్ధాల నాణ్యత బాగుంటుందన్నారు. అవి ఏమాత్రం చెడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.