పవన్కు కష్టకాలమేనా: ఆరెండు పార్టీల్లో చేరికల జోష్...జనసేనాని అసెంబ్లీకి దారేది..?
ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒక పార్టీలో టికెట్లు నిర్థారణ అయిన నేతలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు రచిస్తుండగా.. టికెట్ దక్కని నేతలు ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ నుంచి నేతలు టీడీపీకి వస్తున్నారు... టీడీపీ నుంచి లీడర్లు వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మరి ఈ సారి ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తుందని చెప్పుకుంటున్న జనసేనలోకి మాత్రం నేతల వలసలు కనిపించడంలేదు. చేరిన ఒకరిద్దరు నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వచ్చేశారు. ఇంతకీ జనసేనాని ఆలోచన ఏముంది..? ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యూహాలు రచించనున్నారు... పవన్ పార్టీపై సీనియర్ నేతలు ఆసక్తి చూపకపోవడానికి కారణాలేంటి...
పవన్ వల్లే అధికారంలోకి టీడీపీ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... సినిమా హీరోగా ఉన్నప్పుడు పేరులో నిజంగానే పవర్ ఉండేది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విమర్శలు ఎక్కువయ్యాయి. విమర్శలన్నీ తట్టుకుంటూనే రాజకీయ సముద్రంలో తనదైన శైలితో ముందుకు పోతున్నారు పవన్ కళ్యాణ్. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీలకు మద్దతు ఇచ్చారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలోకి వచ్చిందంటే అది కచ్చితంగా పవన్ ఎఫెక్ట్వల్లే అని సీనియర్ విశ్లేషకులు ఇప్పటికీ చెబుతారు. మరి అంత స్టామినా ఉన్న నాయకుడు ఈసారి ఒంటరిగా బరిలోకి దిగనున్నారు. అయితే ఇప్పటి వరకూ అభ్యర్థులను ప్రకటించకపోవడంపై జనసేనలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది.
పవన్ బలం యువతే.. కానీ సీట్లు గెలిచేంత బలం ఉందా..?
పవర్ స్టార్ పవర్ పాలిటిక్స్ నడపలేకపోతున్నారనే విమర్శ వినిపిస్తోంది. ఇందుకు కారణం కూడా విశ్లేషిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తినప్పటికీ ప్రజల్లో ఎక్కువగా కనిపించకపోవడం పెద్ద మైనస్గా మారిందని చెబుతున్నారు. అంతేకాదు నిర్మాణాత్మకంగా మాట్లాడలేకపోవడం, ఆవేశంతో ప్రసంగాలు చేయడం వంటివి యువతలో క్రేజ్ సంపాదించొచ్చేమో కానీ అది ఓటు బ్యాంకుగా మారదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగానే ఉందటున్న రాజకీయ విశ్లేషకులు... అందులో మెజార్టీ యువతనే అని స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే ఒక్క యువత ఓట్లతో సీట్లు గెలవడం కష్టమేనన్న అభిప్రాయం వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీతో పవన్ అంతర్గతంగా కలసి వెళతారనే ప్రచారం జనసేనానికి మైనస్గా నిలుస్తోందని అదే సమయంలో టీడీపీ జనసేనపై విమర్శలు చేయకపోవడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోందని సీనియర్ అనలిస్టులు భావిస్తున్నారు.
జనసేనలో కనిపించని అనుభవజ్ఞులు..?
ఒక కొత్త పార్టీ నడిపించాలంటే సీనియర్ల అనుభవం ఎంతో అవసరమని చెబుతున్న రాజకీయ విశ్లేషకులు అంత అనుభవం ఉన్న నాయకులు జనసేనలో కనిపించడం లేదని చెబుతున్నారు. నాదెండ్ల మనోహర్కు స్పీకర్గా చేసిన అనుభవం తప్ప మరేమీ లేదు అని చెబుతున్నారు. ఈ మధ్య పార్టీలో చేరిన రావెల కిషోర్ బాబును చంద్రబాబు తన మంత్రి వర్గంలో నుంచి తీసేయడం జరిగిందన్న విషయాన్ని అనలిస్టులు గుర్తు చేస్తున్నారు. ఇక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కొన్ని ఈక్వేషన్స్ మీద జనసేన తీర్థం పుచ్చుకున్నారనేది బహిరంగ రహస్యమే. ఇక మాజీ మంత్రి బాలరాజు తూర్పుగోదావరి జిల్లా నుంచి కొందరు నాయకులు జనసేన పార్టీలో చేరారు. వారంతా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంకా ఏర్పాటు కానీ జిల్లా కమిటీలు, అసెంబ్లీ కమిటీలు
ఇక ఎన్నికల బరిలో నిలిచేందుకు ఈ మధ్యే దరఖాస్తులు చేసుకోవాలని కూడా జనసేన పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల షెడ్యూలు రాబోతోంది. ఇప్పటికే 1400 దరఖాస్తులు వచ్చినట్లు జనసేన చెబుతోంది. మరి ఇప్పటి వరకు జిల్లా కమిటీలు ,అసెంబ్లీ కమిటీలే జనసేన వేయలేదు. పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనుకుంటున్నవారు ఇదే అంశంపై మదనపడుతున్నారు. ఇంకెప్పుడు అధినేత తమకు టికెట్ ఇస్తారు... ప్రజల్లోకి ఎప్పుడు ప్రచారానికి వెళ్లాలా అనే ప్రశ్నలు ఆశావహులను టెన్షన్కు గురిచేస్తున్నాయి. దీంతో జనసేనకు ఓట్లు వస్తాయి కానీ సీట్లు రావా అనే చర్చ మొదలైంది. ఓ కొత్త పార్టీ పెట్టినప్పుడు సీనియర్లు అనుభవాలు ముఖ్యం. మరి జనసేనలో ఉన్న సీనియర్లు ఎవరు... వ్యూహాలు రచించేదెవరు..? అమలు చేసేదెవరు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.
ఉమ్మడి ఏపీలో 18 సీట్లు గెలిచిన ప్రజారాజ్యం
మరోవైపు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన కేవలం ఓట్లు చీల్చడంపైనే దృష్టి సారించిందా అనే కొత్త అనుమానం తలెత్తుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ ప్రారంభమైంది. ఇక పవన్ అన్న చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో చాలామంది సీనియర్లు జాయిన్ అయ్యారు. వ్యూహాలు రచించారు. అమలు చేశారు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పార్టీకి 18సీట్లు వచ్చాయి. అదికూడా ప్రతి ప్రాంతం నుంచి అంటే తెలంగాణలో రెండు సీట్లతో సహా.. కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సీట్లు గెలుచుకుంది. అయితే జనసేనలో పరిస్థితి అలా కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబుకు ఏపీలో మంచి పట్టుంది. అనుభవం కూడా ఉంది. చివరి క్షణంలో తన రాజకీయ చతురతను అమలు పరిచి బొమ్మను మార్చే సత్తా ఉంది. అదే సమయంలో వైసీపీ అధినేత జగన్ గత 14 నెలలుగా పాదయాత్రతో ప్రజల్లోనే కనిపించారు. మరి జనసేనాని పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో పర్యటనలే చేయలేదు. ఎక్కువగా ఉభయగోదావరి జిల్లాలోనే కనిపించిన పవన్ కళ్యాణ్... మిగతా జిల్లాల్లో అప్పుడప్పుడు మాత్రమే అలా కనిపించేవారు. తాజాగా రాయలసీమలో పర్యటిస్తున్నారు.
ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే సమయం తక్కువగా ఉంటుందన్న విషయం పవన్ కళ్యాణ్ గ్రహించి వెంటనే తమ అభ్యర్థులను ప్రకటిస్తే బాగుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే కొత్త ముఖాలకు టికెట్లు ఇస్తే ప్రజల్లోకెళ్లి ప్రచారం చేసుకునేందుకు సమయం సరిపోదని అనలిస్టులు పేర్కొంటున్నారు. ఇంకా ఆలస్యం చేస్తు పవన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నవారు అవుతారని అభిప్రాయపడుతున్నారు. మరి పవన్ ఎలాంటి స్ట్రాటజీ అమలు చేస్తారో కాలమే సమాధానం చెప్పాలి.