రాజకీయాల్లో మీసాలు తిప్పేవాళ్లు...తొడ కొట్టేవాళ్లే:జస్టిస్ చలమేశ్వర్
విజయవాడ:ఇప్పటి రాజకీయాల్లో మీసాలు తిప్పేవారు...తొడ కొట్టేవాళ్లే ఎక్కువయ్యారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారు అంతకంతకూ పెరిగిపోతుండటంతో ప్రజల కోసం నీతినిజాయితీలతో పనిచేసే వారికి చోటు లేకుండా పోతోందని చలమేశ్వర్ ఆవేదన వ్యక్తంచేశారు.
మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ రాసిన "తలచుకుందాం..ప్రేమతో" అనే పుస్తకాన్నిజస్టిస్ చలమేశ్వర్ ఆదివారం విజయవాడలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఒకప్పుడు స్వాతంత్ర్య కోసం పోరాడి నాయకులు జైలుకి వెళితే...ఇప్పుడు రాజకీయాల్లో చేరి పదవులు అనుభవించి తర్వాత జైలుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.
తొడలు కొట్టి, మీసాలు తిప్పేవాళ్లు రాజకీయాల్లోకి వచ్చాక.. శివాజీ వడ్డే, శోభనాద్రీశ్వరరావు లాంటి వ్యక్తులకి అక్కడ అవకాశాలు లేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అభిప్రాయపడ్డారు. సున్నితమైన విమర్శలకు ప్రస్తుత రాజకీయాల్లో చోటు లేకుండా పోతోందని, తొడగొట్టడమే వీరత్వమనుకునేవారు రాజకీయాల్లో పెరుగుతుండడమే దీనికి కారణమన్నారు. ఈ సంస్కృతి మధ్యయుగాల నాటిదని, ప్రస్తుత పరిస్థితుల్లో అది అవసరం లేదని చలమేశ్వర్ చెప్పారు. అయితే తాను మరో రెండు నెలల వరకు రాజకీయాల గురించి మాట్లాడదల్చుకోలేదని చెప్పారు. జస్టిస్ చలమేశ్వర్ ఏ యేడాది పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సమకాలీన రాజకీయాలపై పుస్తకాలు రావలసిన స్థాయిలో రావడం లేదని, ఇలాంటి సమయంలో యలమంచిలి శివాజీ రాసిన "తలచుకుందాం.. ప్రేమతో" పుస్తకం రావడం శుభపరిణామని అన్నారు. సాహిత్యం, కవిత్వం గొప్పగా ఉందని చెప్పుకోవడం కాదు...వాటిని చదివి అందులోని మాధుర్యాన్ని తెలుసుకోవాలని ఈ సందర్భంగా జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సూచించారు. ఎదుటి వ్యక్తి చెడును గమనించడం మానవనైజమని...కానీ...శివాజీ ఆయన తన జీవితంలో కలిసిన ఎంతో మంది వ్యక్తుల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించడం అభినందనీయమన్నారు. అనంతరం మాజీ ఎంపి, "తలచుకుందాం..ప్రేమతో" పుస్తక రచయిత డాక్టర్ యలమంచిలి శివాజీ మాట్లాడుతూ...చరిత్రకారులు చరిత్రను గ్రంథస్థం చేసి భావితరాలకి అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని... అయితే దేశంలో అసలైన చరిత్రకారుడు రైతేనని అన్నారు.