ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా: జస్టిస్ మహేశ్వరి ప్రమాణస్వీకారం...!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి ప్రమాణస్వీకారం చేశారు. జస్టిస్ మహేశ్వరిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసారు. దీంతో ఆయన ఆదివారం సాయంత్రం గన్నవరం చేరుకున్నారు. ఆయనకు కలెక్టర్ ఇంతియజ్ తో పాటుగా హైకోర్టు అధికారులు స్వాగతం పలికారు. సాధారణంగా రాజ్ భవన్ లో జరిగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం ఈ సారి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసారు. గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.
ముఖ్యమంత్రి జగన్ తో పాటుగా ప్రమాణ స్వీకారానికి జీకే మహేశ్వరి కుటుంబసభ్యులు, హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ప్రవీణ్కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, హైకోర్టు అడ్మిన్ రిజిస్ట్రార్ పురుషోత్తం, పలువురు న్యాయమూర్తులు హాజరయ్యారు. 2014లో రాష్ట్ర విభజన తరువాత అయిదేళ్ల పాటు హైదరాబాద్ లోని హైకోర్టు తెలంగాణ..ఏపీ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా కొనసాగింది. అయితే..తెలంగాణ న్యాయవాదులు హైకోర్టు విభజన కోసం ఆందోళన చేయటంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దీనికి అనుగుణంగా హైకోర్టు ఏర్పాటు పైన ఏపీ ప్రభుత్వానికి సూచనలు చేసింది. ఫలితంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమరావతిలోని నేలపాడులో హైకోర్టు తాత్కాలిక భవనం సిద్దం చేసారు.
అమరావతిలోని తాత్కాలిక హైకోర్టు భవనాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్ ప్రారంభించారు. అప్పటి వరకు తాత్కాలికంగా ప్రస్తుతం రాజ్ భవన్ గా కొనసాగుతున్న భవనంలోనే హైకోర్టు నిర్వహించారు. ప్రస్తుతం శాశ్వత ప్రాతిపదికన హైకోర్టు నిర్మాణం పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో ఇప్పటి వరకు హైకోర్టు ఇన్ ఛార్జ్ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు నిర్వహించారు. ఇప్పటికే హైకోర్టును కర్నూలు ఏర్పాటు చేయాలని..లేదు ఇక్కడే కొనసాగించాలని అమరావతి ప్రాంత న్యాయవాదులు నిరసనలు చేస్తున్నారు.
ప్రభుత్వం ఆలోచన ఏంటనేది ఇంకా స్పష్టత రావటం లేదు. ఈ సమయంలో ఏపీ హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వర ప్రమాణ స్వీకారం చేసారు. జస్టిస్ మహేశ్వరి 1961 జూన్ 29న జన్మించారు. 1985 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. మధ్యప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించి సివిల్, క్రిమినల్, రాజ్యాంగపరమైన కేసుల్లో పట్టు సాధించారు. 2005 నవంబర్ 25న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2008లో శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. హైకోర్టు సీజేగా 2023 జూన్ 28న పదవీ విరమణ చేస్తారు.