జగన్ వర్సెస్ జడ్డీల వ్యవహారంలో మరో ట్విస్ట్- సుప్రీం ధర్మాసనం నుంచి తప్పుకున్న జస్టిస్ లలిత్...
జస్టిస్ ఎన్వీరమణకు వ్యతిరేకంగా ఛీఫ్జస్టిస్ బాబ్డేకు ఫిర్యాదు చేయడం, దానిపై ప్రెస్మీట్ నిర్వహించి వివరాలు బయటపెట్టడం వంటి అంశాలపై దాఖలైన మూడు పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించబోతోంది. అయితే విచారణపై సర్వత్రా ఉత్కంఠ సాగుతున్న తరుణంలో సుప్రీంకోర్టులో ట్విస్ట్ చోటు చేసుకుంది.
Recommended Video
జగన్, ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ రవీంద్ర భట్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇవాళ విచారించబోతోంది. అయితే చివరి నిమిషంలో ఈ పిటిషన్ విచారణ నుంచి తాను తప్పుకోవాలని జస్టిస్ లలిత్ నిర్ణయించుకోవడం సంచలనంగా మారింది. తాను ప్రస్తుతం ఇబ్బందికరమైన పరిస్ధితి ఎదుర్కొంటున్నట్లు ఈ పిటిషన్ల విచారణ నుంచి తప్పుకున్న నేపథ్యంలో జస్టిస్ లలిత్ తెలిపారు. ఈ కేసులో భాగస్వాములుగా ఉన్న వారి తరఫున గతంలో తాను కేసులు వాదించానని, అలాంటిది ఇప్పుడు వీరికి సంబంధించిన కేసును విచారించడం సరికాదని భావిస్తున్నట్లు లలిత్ తెలిపారు. అందుకే ఈ పిటిషన్లను మరో బెంచ్కు బదిలీ చేయాలని ఆయన ప్రతిపాదించారు.
అడ్వకేట్లు సునీల్ కుమార్ సింగ్, జీఎస్ మణి దాఖలు చేసిన పిటిషన్లపై ఇవాళ లలిత్ లేకుండానే మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరపబోతోంది. ఛీఫ్ జస్టిస్కు జగన్ రాసిన లేఖ, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలు, ఈ లేఖ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందా రాదా, దీని ఆధారంగా జగన్కు సీఎం పదవి నుంచి తప్పించాల్సి వస్తుందా లేదా అన్న అంశాలపై చర్చ సాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు బెంచ్ నుంచి సీనియర్ న్యాయమూర్తి తప్పుకోవడం సంచలనంగా మారింది. ఈ కేసు విచారణ నుంచి జస్టిస్ లలిత్ తప్పుకోవడంతో మరో బెంచ్కు పిటిషన్ బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్కు రిజిస్ట్రార్ విన్నవించారు. దీంతో ఆయా పిటిషన్ల విచారణ చేపట్టే బెంచ్ను ఛీఫ్ జస్టిస్ ఖరారు చేయాల్సి ఉంది.