సాయిరెడ్డిని రాజ్యసభకు ఎలా?: జగన్కు సూటి ప్రశ్న, 'బాబు వద్దని వారించారు'
అమరావతి: ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు వైయస్ జగన్కు లేదని టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. మంగళవారం ఆయన భూమా నాగిరెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీపై ఎంతో బాధ్యత ఉండేదని, అయితే ఈ ప్రతిపక్షం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని అన్నారు.
ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ప్రజా ప్రయోజనాలను పట్టించుకోకుండా, ప్రజా జీవితంలో లేని వ్యక్తిని రాజ్యసభకు ఎలా పంపుతారని ప్రశ్నించారు. వైసీపీలో తీసుకునేవన్నీ ఏకపక్ష నిర్ణయాలేనని ధ్వజమెత్తారు. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కట్టుబానిసలుగా భావించడం సమంజసమా? అని నిలదీశారు.
ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల భావాలకు ప్రతిపక్షంలో విలువ ఇవ్వడం లేదని అన్నారు. జగన్ తీరుతో రాష్ట్రానికి చాలా నష్టం కలుగుతుందని చెప్పారు. జగన్ ఆరోపిస్తున్నట్టు తమకు డబ్బులు ముట్టలేదని చెప్పిన ఆయన వైసీపీలోకి వెళ్లినప్పుడు జగన్ నన్ను ఎంతకు కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తాము ప్రతిపక్ష నేతను సరైన దారిలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే పార్టీ మారామని, అయినప్పటికీ ఆయన బుద్ధి మారడం లేదని ఆయన మండిపడ్డారు. జగన్ తీరు మారుకుంటే భవిష్యత్తులో వైసీపీ మనుగడ కష్టమేనని నెహ్రూ అన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను, ప్రతిపక్ష నేతలను చూసిన తాము, ఇలాంటి వ్యక్తిని మాత్రం చూడలేదని చెప్పారు.
నాలుగో అభ్యర్ధి విషయంలో చంద్రబాబు వద్దని వారించారు
రాజ్యసభ ఎన్నికల్లో నాలుగో అభ్యర్ధిని పోటీ పెట్టాలని తాము కోరినప్పటికీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దని వారించారని టీడీపీ నేత భూమా నాగిరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలను పెంపొందించాలని, అందుకే పోటీకి నిలబెట్టలేదని ఆయన పేర్కొన్నారు.
రాజ్యసభకు నాలుగో అభ్యర్థిని పోటీలో నిలబెట్టాలని డిమాండ్ చేస్తూ ఏడు గంటలపాటు ముఖ్యమంత్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేశామని, అయినా సరే ఆయన అందుకు ససేమిరా అన్నారని భూమా చెప్పారు. అక్రమాస్తుల కేసులో బయటపడేందుకు సొంత వ్యక్తులను రాజ్యసభకు పంపడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.