ఇదీ జరిగింది: జ్యోతుల నెహ్రూ నివాసంలో ఐటీ సోదాలపై తనయుడి వివరణ
అమరావతి: 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన జ్యోతుల నెహ్రూ ఇంటిపై ఆదాయపుపన్ను శాఖ దాడులు చేసినట్లుగా ప్రచారం జరిగింది. విశాఖపట్నానికి చెందిన అధికారులు ఆయన స్వగ్రామమైన ఇర్రిపాకలోని ఇంట్లో సోదాలు నిర్వహించినట్లుగా ప్రచారం సాగింది.
జ్యోతుల నెహ్రూ ఇంట్లో ఐటీ శాఖ అధికారులు దాడులు జరిగిన ప్రచారంపై ఆయన తనయుడు జ్యోతుల నవీన్ కుమార్ స్పందించారు. తమ ఉమ్మడి ఆస్తి గోదాముల విక్రయానికి సంబంధించి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ గురించి అధికారులు వివరణ అడిగారని తెలిపారు.
తాను కాకినాడలోని ఆదాయపన్ను శాఖ అదనపు కార్యాలయానికి వచ్చి వివరణ ఇచ్చానని చెప్పారు. అంతేతప్ప తమ నివాసంపై ఎలాంటి ఐటీ దాడులు జరగలేదన్నారు. తమది వ్యవసాయ ఆధారిత కుటుంబమని, అందుకే తాము ఐటీ రిటన్స్ గురించి పట్టించుకోలేదన్నారు. ఐటీ అధికారులకు తాము సమాధానం చెప్పుకున్నామని చెప్పారు.