పాపం.. జ్యోతుల! మంత్రి పదవికి ఆశపడి..ఉప ముఖ్యమంత్రి ఛాన్స్ పోగొట్టుకున్నారు!
అమరావతి: జ్యోతుల నెహ్రూ! కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత. తూర్పు గోదావరి జిల్లాకు సీనియర్ రాజకీయ నాయకుడు. తూర్పు గోదావరి జిల్లా రాజకీయాలపై, తన సామాజిక వర్గానికి చెందిన ఓటుబ్యాంకుపై గట్టి పట్టు ఉన్న నాయకుడు. రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్. ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం.. రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. రాజకీయ మనుగడను అగమ్యగోచరంగా మార్చింది.
వికీపీడియ వేదికగా టీడీపీ - వైసీపీ వార్! వైవీ సుబ్బారెడ్డి మతాన్ని రచ్చ చేసిన టెక్కీస్
పార్టీ ఫిరాయించాలనే ఒక్క నిర్ణయం..
తాను గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరడం ఆయన రాజకీయ భవిష్యత్తును అంధకారం చేసిందనే సానుభూతి జిల్లాల్లో వ్యక్తమౌతోంది. ఆలోచించి తీసుకున్నారో, మంత్రి పదవులపై ఆశ పడ్డారో తెలియట్లేదు గానీ.. తన భవిష్యత్తును తానే నాశనం చేసుకున్నారని అంటున్నారు ఆయన అనుచరులు, అభిమానులు. 2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జ్యోతుల నెహ్రూ తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట స్థానం నుంచి గెలుపొందారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, బీజేపీ ప్రభంజనానికి తట్టుకుని ఆయన వైఎస్ఆర్ సీపీ తరఫున అసాధారణ విజయాన్ని నమోదు చేశారు. అప్పటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు.
ప్రతిపక్ష ఉప నేతగా, తన పక్కనే కూర్చోబెట్టుకున్నా..
ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చినప్పటికీ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆ సామాజిక వర్గానికే చెందిన జ్యోతుల నెహ్రూను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ప్రతిపక్ష ఉప నేతగా హోదా కల్పించారు. తదనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో జ్యోతుల నెహ్రూ పార్టీని వీడారు. తెలుగుదేశంలో చేరారు. జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇస్తామని అప్పట్లో చంద్రబాబు ఆశ పెట్టారని, అందుకే ఆయన ఆ నిర్ణయాన్ని తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రోజులు గడిచాయే తప్ప, జ్యోతుల నెహ్రూ ఆశించినట్టుగా మంత్రి పదవి రాలేదు. క్రమంగా ఆయన తెరమరుగు అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచే తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. తన సమీప బంధువు జ్యోతుల చంటిబాబు చేతిలో ఓటమి పాలయ్యారు.
జ్యోతుల రాజకీయం అంధకారమేనా?
ఊహించినట్టే- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తన విజయానికి కారణమైన ప్రతి సామాజిక వర్గానికీ ఆయన పెద్దపీట వేశారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా అయిదు ఉప ముఖ్యమంత్రి హోదాలను వైఎస్ జగన్ ప్రకటించారు. అందులో కాపు సామాజిక వర్గమూ ఒకటి. కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి నాయకుడికీ తాను కృతజ్ఞతలు తెలుపుకొంటున్నానని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.
పార్టీని వీడి.. రెంటికీ చెడ్డారా?
అలాంటి కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడే జ్యోతుల నెహ్రూ పార్టీనీ వీడారు. జ్యోతుల నెహ్రూ పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా తయారైంది. ఆయన తెలుగుదేశంలోకి ఫిరాయించకపోయి ఉంటే కాపు సామాజిక వర్గం కోటా నుంచి ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే వారని వాపోతున్నారు ఆయన అనుచరులు. వైఎస్ఆర్ సీపీలోని కొందరు సీనియర్ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారిందని చెబుతున్నారు.
పోటీ లేదని సంబర పడుతోన్న కాపు నేతలు
కాగా- ఆయన పార్టీలో లేకపోవడం వల్ల తమకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందని ఆశావహులు సంబరాలు చేసుకుంటుండటం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో జ్యోతుల నెహ్రూ పార్టీలో లేకపోవడం పట్ల మిశ్రమ స్పందనలు వ్యక్తమౌతున్నాయి. కొందరు అయ్యో పాపం అంటుండగా.. మరికొందరు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సమయంలో జ్యోతుల పార్టీలో ఉండి ఉంటే మరొకరికి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కి ఉండేది కాదని, లేకపోవడమే మంచిదైందని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలు బాహటంగా చెబుతున్నారు. చేసుకున్న వారికి చేసుకున్నంత అనే సామెత జ్యోతుల నెహ్రూ విషయంలో మరోసారి రుజువైందని ఎద్దేవా చేస్తున్నారు.