ఒకే ఒక్క మిస్డ్ కాల్.. లైఫ్ కు ఎండ్ కార్డ్ ..
బాపట్ల టౌన్ : ఒక్క మిస్డ్ కాల్ ఆమె జీవితానికే టర్నింగ్ పాయింట్ అయింది.. ఇంకా చెప్పాలంటే టర్నింగ్ పాయింట్ కూడా కాదు, ఏకంగా.. ఎండ్ పాయింట్ అయింది. మిస్ట్ కాల్ పరిచయం.. తర్వాత ప్రణయం.. ఆపై పచ్చి మోసం ఆమె జీవితాన్ని కకావికలం చేసేశాయి. చివరకు చావే శరణ్యమని భావించిన సదరు బాధితురాలు ప్రియుడి ఇంటి ముందే సజీవ దహనం అయింది.
నిజాంపట్నం ప్రాంతానికి చెందిన జ్యోతి 10వ తరగతి వరకు చదువుకుని హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే ఇదే క్రమంలో సుమారు నాలుగేళ్ల క్రితం ఆమె మొబైల్ కు వచ్చిన ఓ మిస్డ్ కాల్ ద్వారా తన్నీరు బాలమురళీకృష్ణ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. బాపట్ల పట్టణం దేవునిమాన్యం అతని స్వగ్రామం.
అయితే మిస్డ్ కాల్ పరిచయం కాస్త త్వరగానే సాన్నిహిత్యానికి దారి తీసింది. అటుపై ప్రేమలో మునిగిపోయిన ఇద్దరు.. శారీరకంగాను దగ్గరయ్యారు. ఈ క్రమంలో జ్యోతికి మూడుసార్లు అబార్షన్ కూడా జరిగింది. ప్రియుడి మీద నమ్మకంతో అతనితోనే సహజీవనం చేస్తున్న జ్యోతికి అతడు మాత్రం షాక్ ఇచ్చాడు. జ్యోతిని పక్కనబెట్టేసి బాపట్ల పట్టణానికే చెందిన మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు మురళీకృష్ణ.
మురళీకృష్ణ చేసిన మోసానికి గత ఏప్రిల్ 20వ తేదీన అతడిపై, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది జ్యోతి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు మురళీకృష్ణతో పాటు అతడి కుటుంబ సభ్యులను రిమాండ్ కు తరలించారు.
అయితే రిమాండ్ అనంతరం బయటకు వచ్చిన మురళీకృష్ణతో మాట్లాడడానికి ప్రయత్నించింది జ్యోతి. దీంతో ఈ నెల 14న తెనాలి బస్టాండ్ వద్దకు వస్తే కలుస్తానని మురళీకృష్ణ చెప్పడంతో.. అతను చెప్పినట్టుగానే తెనాలి బస్టాండ్ వద్దకు వెళ్లి కలిసింది. ప్రస్తుతం తాను ఏడునెలల గర్భవతినని తన పరిస్థితి ఏంటని.. మురళీకృష్ణను నిలదీసింది.
జ్యోతి గర్బవతి కావడానికి తనకేం సంబందం లేదని చేతులెత్తేసిన మురళీకృష్ణ.. కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో ఇక తనకు చావే శరణ్యమని జ్యోతి ఆవేదన చెందగా.. చావమని ఆత్మహత్యకు పురిగొల్పాడు మురళీకృష్ణ.
మొత్తం పరిస్థితులకు తీవ్రంగా కలత చెందిన జ్యోతి.. అదే రోజు రాత్రి ప్రియుడు మురళీకృష్ణ ఇంటి ముందు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆ సమయంలో ఆమె సిల్క్ చీర ధరించి ఉండడంతో.. ఒళ్లంతా తీవ్ర గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. కాగా, జ్యోతి మ్రుతిపై ఆసుపత్రి వర్గాల సమాచారం మేరకు బాలమురళీకృష్ణ, అతని తల్లిదండ్రులు తన్నీరు శ్రీనివాసరావు, తల్లి వెంకమ్మ, భార్య సంధ్యతో పాటు మరో ఇద్దరిపై సెక్షన్ 306 కింద కేసు నమోదు చేసిన ఇన్ స్పెక్టర్ వీరాంజనేయులు దర్యాప్తు వేగవంతం చేశారు.