కేఏ పాల్ కు జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలట .. తనపై దాడికి వైసీపీ యత్నం చేసిందట
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. ఏపీ ఎన్నికల్లో తన మాటలతో.. చేతలతో కామెడీ చేస్తున్న కేఏ పాల్ తాజాగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ కావాలని కోరుతున్నారు. తనపై దాడికి వైసీపీ యత్నం చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు . తాను బస చేసిన హోటల్ కు అర్థరాత్రి వేళ దాడి చేసేందుకు ప్రయత్నం చేశారన్నారు. అర్థరాత్రి దాటిన తర్వాత తానున్న హోటల్ కు కొందరు జగన్ పార్టీ కార్యకర్తలు వచ్చి.. దాడి చేసే యత్నం చేశారన్నారు.
ఇక ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లుగా పాల్ చెబుతున్నారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పాల్ బరిలో ఉండటం తెలిసిందే. తనపై దాడికి ప్రయత్నించిన వారి వివరాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినా అధికారులు పెద్దగా పట్టించుకోవటం లేదని ఆయన ఆరోపిస్తున్నారు .
తనకు ప్రాణహాని ఉందని .. ఎలక్షన్ కమిషన్ తనకు జెడ్ ప్లస్ సెక్యురిటీ ఇవ్వాలని చెబితే.. ఏపీ రాష్ట్ర డీజీపీ ఒక గన్ మాన్ ను మాత్రమే ఇచ్చినట్లుగా పేర్కొన్నారు. తనకు సెక్యురిటీని వెంటనే పెంచాలన్న పాల్.. తాను ఫిర్యాదు చేస్తే కనీసం సీసీ కెమెరా ఫుటేజ్ ను పోలీసులు పరిశీలించలేదని వాపోయారు. తనకు ఎదురవుతున్న దారుణ పరిస్థితులు చూస్తుంటే.. జగన్ ఎంతటి నీచమైన రాజకీయాలకు దిగజారాడో అర్థమవుతుందని చెప్తున్నారు కేఏ పాల్ .