కిరాయి వస్తుంది: టీ-టీడీపీపై కేకే, బాబుకు వ్యతిరేకంగా..
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీ బస్సు, రైతుయాత్రల పైన తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కే కేశవ రావు మంగళవారం సెటైర్లు వేశారు. తెలంగాణ టీడీపీ బస్సుయాత్ర మంచిదేనని, కనీసం బస్సులకు అయినా కిరాయి వస్తుందన్నారు. నాడు అమరవీరులకు నివాళులు అర్పించని వారు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరమన్నారు.
అమరవీరుల జాబితాను ఎవరైనా ప్రభుత్వానికి పంపించవచ్చునని తెలిపారు. ఎవరికైనా ప్రభుత్వానికి పంపించేందుకు సిగ్గుగా అనిపిస్తే తమ పార్టీ కార్యాలయానికి పంపించవచ్చునని తెలిపారు. తెలంగాణ టీడీపీ నేతల పైన తెరాస ఎంపీ వినోద్ కుమార్ కూడా మండిపడ్డారు.
తెలంగాణ టీడీపీ నేతలు చేయాల్సింది బస్సుయాత్ర కాదని, దీక్షలు అన్నారు. అది కూడా వారి పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా దీక్ష చేయాలన్నారు. దిగువ సీలేరు విద్యుత్ కోసం వారు దీక్ష చేస్తే బాగుంటుందన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా.. దిగువ సీలేరు విద్యుత్ ఇవ్వాలని వారు పోరాడాలన్నారు. తెలంగాణ పైన చంద్రబాబుకు ప్రేమ ఉంటే దిగువ సీలేరు నుండి విద్యుత్ ఇవ్వాలన్నారు.