కే ట్యాక్స్ ఆటకట్టు ..? సిట్ ఏర్పాటుకు సన్నాహాలు ?
గుంటూరు : కే ట్యాక్స్ పేరుతో అందినకాడికి దోచుకున్న కోడెల శివరాం, ఆయన సోదరి విజయలక్ష్మిపై చర్యలు తీసుకునేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతుంది. కోడెల పుత్రరత్నాల అవినీతిపై ఫిర్యాదుల పర్వం వెల్లువెత్తడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో కే ట్యాక్స్ బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ఒక్కటేమిటి ..?
సత్తెనపల్లి ఎమ్మెల్యేగా కోడెల శివప్రసాద్ విజయం సాధించడంతో .. రాజధాని ప్రాంతంలో అతని కూతురు, కుమారుడు హల్చల్ చేశారు. భూ కబ్జా, కేబుల్ కనెక్షన్లు, ఉద్యోగాలు, కాంట్రాక్టు పేర్లతో అందినకాడికి దోచుకున్నారు. అయితే గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి. ఇప్పుడు టీడీపీ విపక్షానికి పరిమితం అవడం .. వైసీపీ అధికారం చేపట్టడంతో ఒక్కొక్కరు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు.
వెలుగులోకి అరాచకాలు ...
తాజాగా కాంట్రాక్టర్ వాసు తనను కోడెల కుమారుడు శివారం బెదిరించారని పేర్కొన్నారు. నరసరావుపేటలో జరిగిన 'ఖేలో ఇండియా గేమ్స్‘లో మిల్స్ కాంట్రాక్ట్కు గానూ రూ.15 లక్షలు వసూల్ చేశాడని వాపోయారు. ఈ మేరకు రూరల్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నారు. ఇదివరకు కంప్లైంట్ చేద్దామన్నా బెదిరించే పరిస్థితి అని వాపోయారు. మరోవైపు నరసరావుపేట రెండో టౌన్లో కోడెల శివారంపై మరో ఫిర్యాదు నమోదైంది. దివ్యాంగుడు అయిన ఏనుగంటి వెంకట కృష్ణారావును కూడా శివారం వేధించాడు. ఇక్కుర్రు, అల్లూరువారిపాలెం, తుంగపాడులో కేబుల్ కనెక్షన్ను తన నుంచి లాక్కున్నారని ఫిర్యాదు చేశారు. అంతేకాదు శివరాం అనుచరులు తన వద్ద నుంచి రూ.4 లక్షల నగదు కూడా తీసుకున్నారని వాపోయారు.
వేధింపులే ..?
మరోవైపు నరసరావుపేటలోని ఐలా బజార్లో 28 సెంట్ల స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించి ఆస్తిని కబ్జా చేశారని కోడెల శివరాంపై మరో ఫిర్యాదు నమోదైంది. చిరుమెల్ల బసవేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు .. వీలైనంత త్వరగా శివరాంను పోలీసు స్టేషన్కు రప్పించి విచారిస్తామని బాధితులతో చెప్పినట్టు సమాచారం. కోడెల కూతురు, కుమారుడు కే ట్యాక్స్పై వరుసగా ఫిర్యాదులు రావడం ... ప్రభుత్వం కూడా సిట్ ఏర్పాటు చేయాలనే యోచించడంతో కోడెల స్పందించారు. ఈ కేసులు కక్షసాధింపు చర్యలేనని పేర్కొన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతోనే కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. తప్పుడు కేసులు పెట్టి .. వేధిస్తున్నారని కోడెల ఆరోపించారు.
ఇలా వెలుగులోకి ..
కోడెల కూతురు విజయలక్ష్మీ మోసం చేసిందని బాధితురాలు పద్మావతి పోలీసులను ఆశ్రయించారు. గుంటూరులో ఎకరం భూమి తనకు ఉందని ఆమె తెలిపారు. ఆ భూమిపై కన్నుపడ్డ విజయలక్ష్మీ నకిలీ రికార్డులతో బెదిరింపులకు దిగిందని వాపోయారు. భూమి ఇచ్చేందుకు ససేమిరా అనడంతో .. రూ.15 లక్షలు ఇవ్వాలని కోరితే భయపడి ఇచ్చామని తెలిపారు. కానీ తర్వాత మరో .5 లక్షలు ఇవ్వాలని వేధింపులకు దిగుతుందని నిట్టూర్చారు. తన వద్ద అంత డబ్బులేదని చెప్పిన వినకుండా .. బెదిరిస్తున్నారని ఆరోపించారు. వేధింపులు తాళలేక పోలీసులను ఆశ్రయించారు పద్మావతి. తన ఎకరాం భూమి కోసం పద్మావతి బయటకు రావడంతో విజయలక్ష్మీ అరాచకాలు సమాజానికి తెలిసింది.