ఫీజు రూ.10, పార్టీలో వెయ్యి మందిని చేర్పిస్తే: కేఏ పాల్ బంపరాఫర్, విజయవాడను హైదరాబాద్లా చేస్తా
విజయవాడ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఏపీకి ఎంతో చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గురువారం అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఏపీలో భూస్థాపితం కావడం ఖాయమని అన్నారు.
వారికి బీజేపీతో అంతర్గతంగా ఒప్పందం ఉందని, కానీ బయటకు మాత్రం అలా ఉండటం లేదన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి బాహాటంగా మద్దతు ఇస్తున్నారని చెప్పారు. జగన్ బీజేపీకి మద్దతివ్వడానికి కేసులే కారణం అన్నారు. వారు తనను జైలులో పెడతారని భయపడి ఎన్డీయేకు అండగా ఉన్నారన్నారు.
కాబోయే ప్రధాని వారు సెలక్ట్ చేస్తారు
కానీ 2019లో బీజేపీ గెలవదని, మహా అయితే వంద, నూటా పాతిక సీట్లు మాత్రమే వస్తాయని కేఏ పాల్ చెప్పారు. అప్పుడు జగన్ను కాపాడేది ఎవరు అన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గెలవదని చెప్పారు. సెక్యులర్ ఫ్రంట్ ఏర్పాటు కోసం తాము పలువురిని కలుస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు 240కు పైగా సీట్లు వచ్చినా, స్వతంత్రులకు 300 సీట్లు వస్తాయన్నారు. పంతొమ్మిది వందల తొంబైలలో గుజ్రాల్, దేవేగౌడ ఎలా అయితే ప్రధానులు అయ్యారో అలాగే ప్రధాని కాబోతున్నారన్నారు. కాంగ్రెస్ బయట నుంచి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. కనుక మన రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడాలంటే టీడీపీ, వైసీపీలకు ఓటు వేయవద్దని చెప్పారు. ఈ పార్టీలకు ఓటు వేస్తే వీహెచ్పీలకు ఓటేసినట్లే అన్నారు. హిందువుల్లోని 95 శాతం, 25 శాతం మంది ముస్లీంలు, 10 శాతం మంది క్రిస్టియన్లు సెక్యులర్ అన్నారు. కాబట్టి మనం వారిని గెలిపించవద్దన్నారు.
సేవ్ సెక్యులర్ ఇండియా
జగన్, చంద్రబాబులు బీజేపీకే మద్దతుగా ఉన్నారని కేఏ పాల్ చెప్పారు. అందుకే తాను సేవ్ సెక్యులర్ ఇండియా పేరుతో గత రెండేళ్లుగా పని చేస్తున్నానని చెప్పారు. ఈ దేశాన్ని కాపాడాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నానని చెప్పారు. మరో విషయం ఏమంటే, మన తెలుగు రాష్ట్రాలలో పది కోట్ల మంది ప్రజలు ఉన్నారని, ఆరు కోట్ల మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. మూడున్నర కోట్ల మంది ఓటర్లు ఏపీలో, రెండున్నర కోట్ల మంది ఓటర్లు తెలంగాణలో ఉన్నారని చెప్పారు. వీరంతా ప్రజాశాంతి పార్టీలో చేరాలన్నారు.
ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే
ప్రజాశాంతి పార్టీ ద్వారా 60వేల మంది నిరుద్యోగ యువతకు తాము ఓ అవకాశం కల్పిస్తున్నామని కేఏ పాల్ చెప్పారు. వీరంతా ఒక్కొక్కరు వెయ్యి మందిని ప్రజాశాంతి పార్టీలో చేర్పించాలని, అప్పుడు ఆరుకోట్ల మంది ఈ పార్టీలో చేరినట్లు అవుతుందని చెప్పారు. మీకు వెంటనే జూన్ 1వ తేదీ నుంచి ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నెలకు స్టైఫండ్ రూ.3వేలు ఇస్తానని, అక్టోబర్ నెలకల్లా వారికి నేను ఫుల్ టైం ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తానని చెప్పారు. తొలుత ఈ అరవై వేల మందికి ఇస్తానని, ఆ తర్వాత మిగతా లక్షల మందికి మద్దతు ఇస్తామని చెప్పారు.
ఫీజు కేవలం రూ.10, పార్టీలో 1000 మందిని చేర్పిస్తే: బంపర్ ఆఫర్
తనకు ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ఉన్న క్రెడిబులిటీ ఏమంటే.. నేను మాట ఇస్తే తప్పనని ఉందని కేఏ పాల్ చెప్పారు. ఓ తెలుగుబిడ్డగా, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా మాట ఇస్తున్నానని, 60వేల మంది యువత నాకు ఫోన్ చేయాలన్నారు. ఈ 60వేల మంది వెయ్యి మందిని చేర్పించాలని, ఫీజు కేవలం రూ.10 మాత్రమే అన్నారు. చేర్పించిన వెంటనే నేను మిమ్మల్ని కలుస్తానని చెప్పారు. జూన్ 1వ తేదీ నుంచి మీకు రూ.3వేలు గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. 2019 అక్టోబర్ 2న హైదరాబాదులో 2,045 మంది వ్యాపారవేత్తలు వస్తారని, యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.
హైదరాబాద్కు ప్రైమినిస్టర్లు, ప్రెసిడెంట్స్
ఇటీవల టర్కీకి 45 మంది ప్రెసిడెంట్స్ వచ్చినట్లు, నైజీరియాకు 54 మంది ప్రెసిడెంట్స్ వచ్చారని, లిబియాకు 7గురు ప్రెసిడెంట్స్ వచ్చారని, సౌతాఫ్రికాకు 36 మంది ప్రెసిడెంట్స్ వచ్చారని, సూడాన్కు 39మంది ప్రెసిడెంట్స్ వచ్చారని, అలాగే మన తెలుగు రాష్ట్రాల రాజధాని హైదరాబాద్కు వేలాదిమంది వ్యాపారులు, ప్రైమినిస్టర్లు, ప్రెసిడెంట్స్ వస్తారని, మన యువతకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు.
విజయవాడను హైదరాబాద్లా చేస్తా
మరో అయిదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని కేఏ పాల్ చెప్పారు. చంద్రబాబు ఏదో ఉండి అమరావతికి వచ్చేశారని చెప్పారు. తనకు అధికారం ఇస్తే మరో అయిదేళ్లలో విజయవాడను హైదరాబాద్లా మార్చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 20 మంది ఎంపీలను ఏపీ నుంచి గెలిపిస్తే కేంద్రంలో కీలకంగా మారుతామన్నారు. నాడు దేవేగౌడ తక్కువమంది ఎంపీలతో ప్రధాని అయ్యారన్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే ఇంకా మంచిదని చెప్పారు. ప్రజాశాంతి పార్టీకి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.