ఎగ్జిట్ పోల్స్ పై పాల్ .. ప్రజాశాంతి పార్టీకి 30 సీట్లు ..హెలికాఫ్టర్ కు ఓట్లేస్తే ఫ్యాన్ కు పడ్డాయట
తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పై ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాపతంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ తనను షాకింగ్ కు గురిచేశాయని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. ఈ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలన్నీ ట్యాంపరింగ్ కు గురి అయ్యాయని ఆరోపించారు. అంతే కాదు తమ పార్టీ గుర్తు అయిన హెలికాఫ్టర్ కు ఓటేస్తే అది ఫ్యాన్ కు పడిందని పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు .ఈ విషయంలో నిజం ఏమిటో దేవుడికే తెలియాలని చెప్పిన పాల్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో పాల్ వీడియో వైరల్ గా మారుతుంది.
ఎగ్జిట్ పోల్స్ పై స్పందించిన కేఏ పాల్ .. హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యానుకు పడిందని ఆరోపణ
ఇక ఈ ఎన్నికల్లో కపిల్ సిబల్ లాంటి వ్యక్తులు చెప్పినదాని ప్రకారం అమెరికా ఇంటెలిజెన్స్, రష్యన్ హ్యాకర్ల పాత్ర ఈ ఎన్నికల్లో ఉన్నట్లు స్పష్టమయింది అని పాల్ పేర్కొన్నారు. నర్సాపురం లోక్ సభ స్థానంలో తనకు చాలా ఫిర్యాదులు వచ్చాయనీ, తాము హెలికాప్టర్ గుర్తుకు ఓటు వేస్తే ఫ్యానుకు పడిందని ప్రజలు ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు . ఇక అన్ని ఓట్లు తమకు పడకపోయినా ఓ 70-80 శాతం ఓట్లు మాకే పడ్డాయి అని మరోమారు పాల్ అందర్నీ అవాక్కయ్యేలా చేశారు.
ఈ ఎలక్షన్ ఫ్రాడ్ అని ముందే చెప్పా .. కేఏ పాల్
‘ఈ ఎలక్షన్ ఫ్రాడ్ అని నేను ముందుగానే చెప్పానన్న పాల్ ఇప్పుడు అందరూ అదే చెబుతున్నారు అంటూ పేర్కొన్నారు. అన్ని ఓట్లు పడకపోయినా నేను ఇంకా ఇండియాలోనే ఉన్నానని తెలిపారు. ఏపీలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఈసీని కోరుతున్నా. అయితే ఇప్పుడు ఈసీలో ఓ కమిషనర్ అశోక్ లావాసాకు సీఈసీ అరోరాతో అభిప్రాయభేదాలు ఉన్నాయి. కాబట్టి అది సాధ్యం కావటం లేదని పాల్ చెప్పారు. అంతే కాదు ఏపీలో ఎన్నికలు రీ కాల్ చెయ్యాలని సుప్రీం కోర్టుకు వెళతానని చెప్పారు పాల్ .
ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజాశాంతి పార్టీకి 30 సీట్లు వస్తాయన్న కేఏ పాల్
ఏపీలో ఎన్నికలు రీకాల్ చేయాలని హైకోర్టుకు వెళితే పిటిషన్ ను కొట్టేశారు. ఇక మనకు సుప్రీంకోర్టే దిక్కు. ఏదేమయినా ఏపీలో మనకు 30 ప్లస్ సీట్లు వస్తాయి అంటూ ప్రజా శాంతి పార్టీ కి 30 సీట్లు వస్తాయని పేర్కొన్నారు. టీడీపీకి 90-100 సీట్లు వచ్చినా, లేక వైసీపీకి 90-100 సీట్లు వచ్చినా మన 30 స్థానాలు మనకే ఉంటాయి' అని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ పై దీన్నే తన కామెంట్ గా పరిగణించాలని మీడియా ఛానల్స్ కు కూడా విజ్ఞప్తి చేశారు కేఏ పాల్ . గాడ్ బ్లెస్ యూ.. గుడ్ నైట్.. గుడ్ మార్నింగ్ అంటూ ఆయన తన సందేశాన్ని ముగించారు.