ఎస్పీ బాలు కోలుకోవాలని కేఏ పాల్ ప్రత్యేక ప్రార్ధన- వీడియో వైరల్
క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తాను రాజకీయాల్లోకి రాకముందు ఎన్నో మత ప్రచార సభల్లో పాల్గొనేవారు. కేవలం తన ప్రార్ధనలతోనే జబ్బులన్నీ నయం చేస్తానని చెప్పుకునే వారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన ప్రస్తుతం ప్రార్ధనలకు దూరంగా ఉంటున్నారు. కేవలం విదేశాల్లో జరిగే ప్రార్ధనా కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటున్నారు. తాజాగా ఆయన చాలా కాలం తర్వాత ఓ ప్రార్ధన చేశారు. దాని వీడియోను సైతం తన ఫేస్ బుక్ పేజ్లో ఉంచారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారిపోయింది.
తీవ్ర అనారోగ్యంతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు, సినీ రంగ పెద్దలు ప్రార్ధనలు చేస్తున్నారు. దశాబ్దాలుగా తెలుగు, తమిళంతో పాటు మరెన్నో భాషల్లో తన గాత్రంతో సినీ అభిమానులను అలరించిన బాలసుబ్రహ్మణ్యం క్షేమంగా తిరిగి రావాలని అంతా కోరుకుంటన్నారు. ఇదే కోవలో కేఏ పాల్ కు కూడా ఎస్పీ బాలు కోసం ప్రార్ధన చేయాలని కొందరు కోరారు. దీంతో వెంటనే స్పందించిన పాల్ ఎస్పీ బాలు కోలుకోవాలని ఏసు ప్రభువును ప్రత్యేకంగా ప్రార్ధించారు.
తన ప్రార్ధనలో వీడియో చూస్తున్న అందరినీ భాగస్వాములు కావాలని కేఏ పాల్ కోరారు. కుల మతాలకు అతీతంగా అందరూ కళ్లు మూసుకుని తన ప్రార్ధన ఆలకించాలని, చివర్లో ఆమెన్ చెప్పాలని కూడా కోరారు. గతంలో తాను ప్రార్ధన ఆలకించి జీసస్ ఎందరో ప్రాణాలు కాపాడిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ కేఏ పాల్ చేసిన ప్రార్ధన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియో షేర్ చేసిన తక్కువ సమయంలోనే 50 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్యంగా తిరిగి రావాలంటూ కేఏ పాల్ చేసిన ప్రార్ధన గతంలో ఆయన నిర్వహించిన సువార్త సభలను గుర్తుకు తెచ్చిందని అభిమానులు సంబర పడుతున్నారు. ఎలాంటి కల్మషం లేకుండా మాట్లాడే పాల్.. తొలిసారి ఎస్పీ బాలు వంటి గాయకుడి కోసం ప్రార్ధన చేయడం ఎంతో మందిని కదిలించేలా ఉంది. దీంతో పాల్పై ప్రశంసల జల్లు కురుస్తోంది.