'చిరంజీవి, వైయస్లపై నేను చెప్పిందే జరిగింది, మోడీకి సపోర్ట్ చేయవద్దని అద్వాని నన్ను అడిగారు'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అవసరం లేదని, అలాగే ప్రత్యేక హోదా కూడా అవసరం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గురువారం అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓ గుడ్ న్యూస్... మనకు ప్యాకేజీ, అవసరం లేదని, తెలుగు ప్రజలు అడుక్కునే వాళ్లు కాదన్నారు. హోదా కూడా అవసరం లేదన్నారు.
ఫీజు రూ.10, పార్టీలో వెయ్యి మందిని చేర్పిస్తే: కేఏ పాల్ బంపరాఫర్, విజయవాడను హైదరాబాద్లా చేస్తా
ఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ హోదా ఇస్తామని చెప్పారని, కానీ అసలు ఆయన ప్రధానమంత్రి అయితే కదా అన్నారు. వంద సీట్లు కూడా గెలవకుండా ప్రధాని అవుతారా అన్నారు. సేవ్ సెక్యులర్ పేరుతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు 300 సీట్లు గెలుస్తాయని, ఇందులోని వారే ప్రధాని అవుతారని చెప్పారు. దేవేగౌడ అప్పుడు ఎలా ప్రధాని అయ్యారో తెలిసిందే అన్నారు. ఏపీ, తెలంగాణలు కేంద్రంలో కీలకం అన్నారు.
ఏపీకి హోదా, ప్యాకేజీ అవసరం లేదు
ప్రత్యేక ప్యాకేజీ, హోదా ఎందుకు వద్దో కూడా చెప్పారు. రాష్ట్రంలో నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఇస్తానని నేను ఇటీవల చెప్పానని కేఏ పాల్ అన్నారు. 2045 మంది బిలియనీర్స్, మరో 5గురు రాయల్ ఫ్యామిలీస్ వద్ద 10 ట్రిలియన్ల క్యాష్ ఉందని చెప్పారు. తనకు పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయన్నారు. తనకు అధికారం ఇస్తే అయిదేళ్లలో 7 లక్షల కోట్ల రూపాయలు తీసుకు వచ్చి చూపిస్తానని, అప్పుడు ఒక్క నిరుద్యోగి అయినా ఉంటారా అన్నారు. బడ్జెట్ను డబుల్ చేసి చూపిస్తానన్నారు. తాను గెలిచిన నియోజకవర్గానికి రూ.100 కోట్లు ఇస్తానని చెప్పారు.
నేను చేశాను, చేయగలను
ఇప్పుడున్న రెండు పార్టీలు వైసీపీ, టీడీపీలు లక్షల కోట్లు దోచుకుంటారని కేఏ పాల్ అన్నారు. వారు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారని చెప్పారు. అయితే ఈ విషయం (దోచుకోవడం) తనకైతే తెలియదని, దేవుడికి తెలియాలని అన్నారు. దోచుకోవాలనుకుంటే వారికి ఓట్లు వేయాలన్నారు. తాను ఇప్పటి వరకు రూ.మూడున్నర లక్షల కోట్లు ఇచ్చాను, ఇప్పించానని చెప్పారు. తనకు, వారికి (టీడీపీ, వైసీపీ) వెలుగుకు, చీకటికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. నేను చేశాను, చేయగలనని చెప్పారు.
నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి
తనకు ఒక్క ఛాన్స్ (గెలిపించడం) ఇవ్వండని కేఏ పాల్ అన్నారు. ఇప్పటికీ నేను రాత్రి పగలు సరిగా నిద్రపోనని చెప్పారు. రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఆరు వరకు గ్లోబల్ వర్క్స్ చేస్తున్నానని, ఏదో సమయం దొరికితే కొద్ది నిమిషాలు పడుకుంటున్నానని చెప్పారు. తనకు నమ్మకం ఉందని చెప్పారు. తన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట నెరవేరుతుందని చెప్పారు. నేను చెప్పినవి అన్నీ జరిగాయన్నారు.
చిరంజీవి సహా అన్నింటికి నేను చెప్పింది జరిగింది
వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోతారు, రోశయ్య ముఖ్యమంత్రి అవుతారని 2007లోనే చెప్పానని అదే జరిగిందని కేఏ పాల్ అన్నారు. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి17 నుంచి 20 సీట్లు వస్తాయని, అల్లు అరవింద్ కూడా గెలవరని చెప్పానని, అదే జరిగిందన్నారు. 2008లో కర్ణాటకలో బీజేపీ గెలుస్తుందని చెప్పానని, అదే జరిగిందన్నారు. 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని, ఆ తర్వాత జయలలిత, కేసీఆర్, నవీన్ పట్నాయక్, చంద్రబాబులు ముఖ్యమంత్రులు అవుతారని చెప్పానని, అదే జరిగిందన్నారు. తన నోటి నుంచి వచ్చింది జరుగుతుందని తనకు తెలుసు అన్నారు. ఈ రోజు వరకు నేను చెప్పిన ఒక్క మాట జరగకుండా లేదన్నారు. అలాగే, ఇప్పుడు టీడీపీ, వైసీపీలు భూస్థాపితం కాబోతున్నాయన్నారు.
కేసీఆర్ గురించి
తెలంగాణలో కేసీఆర్తో కలిసి 2019 అక్టోబర్ 2వ తేదీన గ్లోబల్ పీస్ సమ్మిట్లో పాల్గొంటామని కేఏ పాల్ చెప్పారు. 2045 మంది బిలియనీర్లు, వందల మంది ప్రెసిడెంట్లు వస్తారని చెప్పారు. 2019లో లోకసభలో కేసీఆర్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. నేను పొత్తులపై మార్చిలో నిర్ణయిస్తానని చెప్పారు. అవసరమైతే పొత్తులు ఉంటాయన్నారు. లేదంటే ఒంటరి పోరు చేస్తామన్నారు. చిన్న చిన్న పార్టీలకు రెండు మూడు సీట్లు ఇస్తామన్నారు.
మోడీ కోసం 18 రాష్ట్రాల్లో ప్రచారం చేశా
మీరు ఎన్నికలకు ముందే వస్తున్నారని, 2014లో ఇలాగే వచ్చారని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దానికి కేఏ పాల్ స్పందిస్తూ.. 2014లో కూడా వచ్చానని, వాళ్ల విజ్ఞప్తి (బీజేపీ) మేరకు నరేంద్ర మోడీ కోసం 18 రాష్ట్రాలు తిరిగి ప్రచారం చేశానని చెప్పారు. పంజాబ్, గుజరాత్, యూపీలకు కూడా తనకు ఓటు బ్యాంక్ ఉందని పిలిచారని చెప్పారు. ఆరెస్సెస్ పెద్దలీడర్లు కూడా తనకు ఫోన్ చేసి పిలిచారన్నారు. మోడీ తనతో దాదాపు గంటా నలభై నిమిషాలు మాట్లాడారన్నారు. సపోర్ట్ చేయాలని కోరారన్నారు. రాజ్ నాథ్ సింగ్, అద్వానీ వంటి నేతలు కూడా తనకు ఘన స్వాగతం పలికారని చెప్పారు.
మోడీకి సపోర్ట్ చేయవద్దని అద్వానీ చెప్పారు
అద్వానీ మాత్రం తనకు వద్దని చెప్పారని అన్నారు. నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వవద్దని అద్వానీ చెప్పారని, అతను తన హామీలను నిలబెట్టుకోరని చెప్పారని, దానికి తాను 2009 నుంచి అండగా నిలబడ్డానని, ఇప్పుడు ఎలా వెనక్కి పోతానని అడిగానని కేఏ పాల్ చెప్పారు. మీరు నా గుడ్ ఫ్రెండ్, మీరు నాకు గురువు లాంటివారని అందుకే చెబుతున్నానని, మోడీకి సపోర్ట్ చేయవద్దని అద్వానీ తన ఇంటికి డిన్నర్ కోసం పిలిచి చెప్పారని అన్నారు. మోడీ, అద్వానీలు తనను పిలిచారన్నారు. అప్పుడు నేను పార్టీ పెట్టలేదని చెప్పారు.
ఏపీలో మేం స్వీప్ చేస్తాం
ఏపీలో తాను స్వీప్ చేస్తానని మీడియా మిత్రులు చెబుతున్నారని కేఏ పాల్ అన్నారు. తనకు ఏపీలో మంచి కేడర్ ఉందన్నారు. పదిలో నాలుగు ఓట్లు తనకే పడతాయని చెప్పారని అన్నారు. ఫిబ్రవరిలో కో ఆర్డినేటర్లు, లీడర్లతో మీటింగ్ పెడతానని చెప్పారు. రాస్తా రోకోలు నిర్వహిస్తానని చెప్పారు. చంద్రబాబు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చారా అన్నారు. పెద్ద పెద్ద ప్రామిస్లు చేయవద్దన్నారు. మేం ఏపీలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని చెప్పారు. ప్రజాశాంతి పార్టీ సభ్యత్వం ఫీజు రూ.10 అన్నారు. అభ్యర్థులుగా (ఎమ్మెల్యే) కావాలనుకుంటే ఫిబ్రవరి 21వ తేదీలోగా 10వేల మందిని పార్టీలో చేర్చాలన్నారు. పదివేల మందితో నియోజకవర్గంలో మీటింగ్ పెట్టాలన్నారు. 2019లో పొత్తుల కోసం చిన్నచిన్న పార్టీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. తాము లెఫ్ట్, జనసేన, లోక్సత్తా, చిన్న పార్టీలను ఆహ్వానిస్తున్నామన్నారు. గెలిచిన నియోజకవర్గానికే రూ.100 కోట్లు ఇస్తామని, కాబట్టి గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లు ఇస్తామని, ఎందుకంటే వారు గెలవకుంటే నియోజకవర్గానికి రూ.100 కోట్లు పోతాయన్నారు. అవినీతిని అంతం చేసి, ఏపీని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని చెప్పారు.