నన్ను అరెస్ట్ చేసే ప్రయత్నాలు, నన్ను చంపితే..: మీడియా ముందు ఏడ్చిన కేఏ పాల్
అమరావతి: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ ఆదివారం నాడు కంటతడి పెట్టారు. ఆయన విజయవాడలో మీట్ ది ప్రెస్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గతంలోని అంశాలను గుర్తు తెచ్చుకొని, ప్రస్తుత పరిణామాలు ఆవేదనకు గురి చేస్తున్నాయంటూ ఏడ్చేశారు.
తనను మళ్లీ అరెస్ట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. రూ.30 వేల కోట్లు వసూలు చేశానని తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్, జనసేన ఓట్లను చీల్చటానికి తాను రాలేదన్నారు. కొందరు చెబుతున్నట్టు తాను.. చంద్రబాబు వదిలిన బాణం కాదన్నారు. త్వరలోనే విజయమ్మ, జగన్ను.. మీకు రాజకీయం అవసరమా అని ప్రజలు ప్రశ్నిస్తారని చెప్పారు.
మన ఇద్దరిలో ఒకర్ని చంపి, మరొకరిని జైలులో పెడతారని తన అన్న గతంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ కంటతడి పెట్టారు. ఇప్పుడు డబ్బులు వసూలు చేస్తున్నానని ఆరోపిస్తూ తనను మళ్లీ అరెస్ట్ చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు.
తనకు ఆరోగ్యం బాగుందని, తాను మెంటల్ కాదని, కానీ తనకు పిచ్చి ఉందని, ఎర్రగడ్డ తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఒకవేళ తనను చంపితే ట్రస్ట్ డబ్బులన్నీ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వీలునామా రాసి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్కు ఇస్తానని చెప్పారు.
ఏపీలో అభివృద్థి అనేది అస్సలు జరగలేదని, అభివృద్థి కావాలంటే ప్రజాశాంతి పార్టీకే ఓటేయాలని అంతకుముందు పిలుపునిచ్చారు. ఏపీలో జరిగిన అభివృద్థి గురించి ఎవరితోనైనా డిబేట్లో పాల్గొనడానికి సిద్ధమని చెప్పారు. చంద్రబాబుతో డిబేట్కు వస్తే మాట్లాడేందుకు సిద్ధమన్నారు. జగన్, పవన్ కళ్యాణ్తో కూడా సిద్ధమని చెప్పారు. మంత్రి నారా లోకేష్ గంటపాటు తనతో వస్తే టీడీపీ ఎలాంటి అభివృద్థి చేయలేదని నిరూపిస్తానని చెప్పారు. డిబేట్కు లోకేష్ను పంపించాలని చంద్రబాబుకు సూచించారు.