తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిపోనున్న డబుల్ డెక్కర్ రైలు!
విజయవాడ: తెలంగాణలోని కాచిగూడ నుంచి తిరుపతి, గుంటూరు మధ్య తిరుగుతున్న డబుల్ డెక్కర్ రైలును ఏపీకి తరలించి, విశాఖ నుంచి తిరుపతి మధ్య నడిపించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి అంతగా స్పందన లేదని చెబుతున్నారు.
రైలు ఖాళీగా తిరుగుతోందని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి డబుల్ డెక్కర్ ఏసీ రైళ్ల కోసం చాలా రాష్ట్రాలు ప్రయత్నించాయి. తెలంగాణ ప్రభుత్వం లాబీయింగ్ ద్వారా ఈ రైలు కాచిగూడకు వచ్చింది.
ఇది కాచిగూడ నుంచి తిరుపతికి రెండ్రోజులు, కాచిగూడ నుంచి గుంటూరుకు రెండ్రోజుల పాటు రాకపోకలు సాగిస్తుంది. అయితే, రైలు చాలా వరకూ ఖాళీగానే తిరుగుతోంది. దీంతో, ఈ రైలును తెలంగాణ నుంచి ఏపీకి చేర్చి విశాఖ నుంచి రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరుల మీదుగా తిరుపతికి నడిపితే ప్రయాణికుల స్పందన ఉంటుందని భావిస్తున్నారు.