కడప విద్యార్థికి గూగుల్ రూ.2 లక్షల రివార్డ్...లోపం కనుక్కున్నాడని!
కడప:గూగుల్ పేరు తెలీని టెక్కీలు...ఆ పదం వినని సామాన్యులే ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీ గూగుల్ తమ సంస్థ కార్యకలాపాలకు సంబంధించి అన్నింటికంటే బాగా ప్రాచుర్యం పొందింది సెర్చి ఇంజన్ విభాగంలో...
అందరికీ అన్నింటి గురించి వెతికిపెట్టే ఈ జగత్ విఖ్యాతి సంస్థకు సంబంధించి...ఓ లోపాన్ని కనుగొనడం ద్వారా గూగుల్ నే ఖంగుతినిపించాడో విద్యార్థి. కడపలో ఇంజినీరింగ్ చదువుతున్న ఈ కుర్రాడి టాలెంట్ కు అబ్బురపడిన గూగుల్ ఆ కుర్రాడికి ఊహించని బహుమతి ఇచ్చి సత్కరించింది. కారణం ప్రపంచంలోనే మేటి అనదగ్గ ఐటి నిపుణులను ఏరి కోరి ఎంపిక చేసుకునే ఈ సంస్థ అత్యుత్తమ ప్రతిభావంతులైన ఉద్యోగులు కలిగిన కంపెనీగా కూడా విశేషంగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అంతటి మహామహులు కనిపెట్టలేని ఒక ప్రత్యేకమైన లోపాన్ని ఈ విద్యార్థి కనుగొనడమే గూగుల్ యాజమాన్యం స్పందనకు కారణం.
కడపకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి గోపాల్సింగ్ గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఓ లోపం గురించి తెలుసుకొని ఆ సమాచారాన్ని గూగుల్ సంస్థకు తెలియజేశాడు. తమ తప్పును గురించి తెలుసుకున్న గూగుల్ దాన్ని సరిదిద్దుకోవడంతో సరిపెట్టేయలేదు. తమ తప్పు గురించి తమకు వెంటనే తెలియజేసిన విద్యార్థి ఎవరో తెలుసుకొని అతడికి 3133.70 డాలర్లు(రూ. 2.10 లక్షలు) ప్రైజ్ మనీ ప్రకటించింది.
అంతేకాదు ఒక ప్రత్యేకమైన సమావేశం పెట్టి ఆ విద్యార్థిని గూగుల్ ప్రతినిధులు ఆ విద్యార్థి గోపాల్ సింగ్ ను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థి గోపాల్ సింగ్ మాట్లాడుతూ గూగుల్ లో ఒక లోపం ఉందని, ఆ లోపం ద్వారా ప్రత్యర్థి కంపెనీలు గూగుల్తో పాటు ఆ సంస్థతో టైఅప్ అయిన కంపెనీల రహస్యాలను చౌర్యం చేసే ప్రమాదం ఉందని చెప్పారు. దాన్నే తాను గుర్తించి గూగుల్కు తెలియజేసినట్లు గోపాల్సింగ్ వెల్లడించారు.