కడప ఫ్యాక్షన్ అసెంబ్లీలో .. ఇది రాజన్న రాజ్యమా .. సస్పెన్షన్ పై భగ్గుమంటున్న టీడీపీ
ఏపీ అసెంబ్లీలో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కెయ్యాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపిస్తున్నారు. ఏపీ అసెంబ్లీ నుంచి తమను అన్యాయంగా సస్పెండ్ చేసిన, ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని టిడిపి ఎమ్మెల్యేలు స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు జగన్ ప్రజలకిచ్చిన హామీలపై తామెక్కడ నిలదీస్తామో అన్న భయంతో తమను సభ నుండి కావాలని బయటకు గెంటి వేశారని వారు ఆరోపిస్తున్నారు.
జగన్ స్ట్రాటజీ ... చంద్రబాబు టీమ్ కు చెక్ .. ఇక ఈ అసెంబ్లీ సమావేశాల్లో బాబుకు బాసటగా ఎవరు ?
మాట తప్పను ,మడమ తిప్పను అని చెప్పి మాట తప్పారు అంటున్న టీడీపీ... . కక్ష సాధింపుతోనే సస్పెన్షన్
తాము అనుకున్నది అంతా జరిగిందని , కడప ఫ్యాక్షన్ అసెంబ్లీలోకి ప్రవేశించింది అని అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. తాము ఇచ్చిన వీడియోలను కూడా సభలో ప్రదర్శించ మంటే ఒప్పుకోలేదని, ఎస్సీ ఎస్టీ మహిళలకు జగన్ ఇస్తున్న పెన్షన్ గురించి మాట్లాడటమే తప్పయిందని , అందుకే సభలో లేకుండా చేశారంటూ ఆరోపిస్తున్నారు. మాట తప్పను ,మడమ తిప్పను అన్న జగన్ ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతున్నారని అచ్చన్న పేర్కొన్నారు.
ఇక బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల సమయంలో అసెంబ్లీలోకి మార్షల్స్ ఎప్పుడు ప్రవేశించి లేదని పేర్కొన్నారు. కావాలని కక్షపూరిత చర్యల్లో భాగంగానే తమను సస్పెండ్ చేశారంటూ ఆరోపణ చేశారు బుచ్చయ్య చౌదరి.
మహానుభావులు నడయాడిన సభలో జగన్ వంటి వ్యక్తులను చూడటం దురదృష్టకరమన్న తెలుగు తమ్ముళ్ళు
ఇక మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య వంటి మహానుభావులు నడయాడిన సభలో జగన్ వంటి వ్యక్తులను చూడటం దురదృష్టకరమని మాజీ మంత్రి ఆలపాటి రాజా మండిపడ్డారు. సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సభ్యులను అగౌరవ పరిచేందుకో, కక్షలు, కార్పణ్యాలకో అసెంబ్లీ వేదిక కాకూడదని పేర్కొన్న ఆలపాటి రాజా ప్రజల పక్షాన నిలిచే నేతల గొంతు నొక్కడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. ఇక నిమ్మల రామానాయుడు పాదయాత్రలో ప్రజలకు వరాల జల్లు కురిపించిన జగన్, ఇప్పుడు హామీలను నెరవేర్చడంలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు అని అన్నారు. ఇక ఇదే విషయాన్ని గురించి తాము ప్రశ్నిస్తే సభ నుండి సస్పెండ్ చేస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వం తమను ఎన్ని ఇబ్బందులకు గురిచేసిన జగన్ సర్కారు పనితీరు పై పోరాటం చేస్తూనే ఉంటామని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? అని ఫైర్
టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేయటంతో ఆగ్రహించిన చంద్రబాబు మిగతా సభ్యులతో సహా సభ నుంచి వాకౌట్ చేశారు.ఇక చంద్రబాబు సైతం జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు.
‘ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని వైసీపీ దద్దమ్మలు, దాని గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పుకోలేక ఎలా రెచ్చిపోతున్నారో చూడండి. మనం ప్రజాస్వామ్య పాలనలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా?' అని ప్రశ్నించారు నారా లోకేష్ . ఇదేనా రాజన్న రాజ్యం అని నిలదీశారు . ‘జగన్ గారు ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ రూపంలో ఒక్కో మహిళకు లక్షా ఇరవై వేల రూపాయిలు ఇవ్వాలి. జగన్ గారు మడమ తిప్పడం, మాట మార్చడం ద్వారా ఒక్కో బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళకి రూ.45 వేల నష్టం కలుగుతోంది'. అంటూ నారా లోకేష్ జగన్ పై మండిపడ్డారు .