లోకేష్ జోరు, జగన్ చేజారుతున్న కడప: 'వైసిపిలో ఏంజరుగుతోంది?'
కడప: ఏపీలో.. ముఖ్యంగా కడప జిల్లాలో ఆపరేషన్ ఆకర్ష్ పైన టిడిపి నేత నారా లోకేష్ దృష్టి సారించారు. లోకేష్ ఆపరేషన్కు వైసిపి అధినేత జగన్ కుదేలు అవుతున్నారు. కడప వైయస్ కుటుంబానికి పెట్టని కోట. ఇప్పుడు మాత్రం అంతా తారుమారు అవుతోంది.
కడప జిల్లా నుంచి ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, జయరాములు, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. లోకేష్ ఆపరేషన్ ఆకర్ష్ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జగన్ తన ప్రయత్నాలు చేస్తున్నారు.
ఒక రోజు క్రితం.. పార్టీ వీడమని చెప్పిన వారు ఆ తర్వాత సైకిల్ ఎక్కుతున్నారు. దీంతో వైసిపిలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎంటారో, ఎవరు వెళ్తారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. టిడిపి మాత్రం ఎవరు వచ్చినా చేర్చుకునేందుకు సిద్ధంగా ఉంది.
కడపలో వైయస్ కుటుంబానికి ఉన్న పట్టు నేపథ్యంలో గత సార్వత్రిక ఎన్నికలలో వైసిపి సత్తా చాటింది. మొన్నటి వరకు కడప జిల్లాలో తిరుగులేని పార్టీగా ఉన్న వైసిపికి ఇప్పుడు ఇబ్బందులు వచ్చాయి. అన్నింటా మెజార్టీ ఉండటంతో ఎదురులేదని భావిస్తుండగా తాజాగా టిడిపి వ్యూహాత్మకంగా వేసిన అడుగులు జిల్లాలో వైసిపిని దెబ్బతీస్తున్నాయి.
పట్టుబిగించేందుకు టిడిప్ ప్రయత్నం
కడప జిల్లాలో టిడిపిక్రమంగా పట్టు బిగించేందుకు పావులు కదుపుతోంది. మరికొందరు వైసిపి తలను ఆకర్షించే పనిలో లోకేష్ ఉన్నారు. వైసిపిలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. వైసిపికి చెందిన 9 మంది ఎమ్మెల్యేల్లో ఇద్దరు వెళ్లిపోగా, మరికొందరు టిడిపి వైపు చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో జగన్ రంగంలోకి దిగి బుజ్జగింపులు మొదలు పెట్టారని అంటున్నారు.
రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారు: ధర్మాన
తమ పార్టీ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకోవడంపై వైసిపి నేత ధర్మాన ప్రసాద రావు స్పందించారు. ఇలా ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసుకుంటూ పోతే రాచరిక కాలంనాటి వ్యవస్థ పునరావృతమవుతుందన్నారు. రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రతిదీ న్యాయ వ్యవస్థకు లోబడే ఉండాలన్నారు.
అసెంబ్లీ స్పీకర్ కూడా అందుకు మినహాయింపు కాదని చెప్పారు. రాజకీయాలను చంద్రబాబు పూర్తిగా వ్యాపారంగా మార్చేశారన్నారు. పార్టీ పిరాయింపులపై రాజ్యాంగ సవరణ చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాన ప్రసాద రావు డిమాండ్ చేశారు.