YS విజయమ్మతో భేటీ అయిన అవినాష్ రెడ్డి
సీబీఐ విచారణకు హాజరయ్యేముందు అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్యకేసులో సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. విచారణకు హాజరయ్యే ముందు కీలక పరిణామం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి విజయమ్మతో అవినాష్ రెడ్డి భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లో విజయమ్మ ఉంటున్న ఇంటికి వెళ్లిన అవినాష్ ఆమెతో దాదాపు 15 నిముషాలపాటు భేటీ జరిపారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. భేటీ సందర్భంగా వివేకా హత్యకేసుకు సంబంధించిన అంశాలను చర్చించినట్లు తెలుస్తోంది. సీబీఐ కార్యాలయం ఎదుట విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి ప్రకటించారు.
వైఎస్ వివేకా హత్యకేసు దర్యాప్తు ప్రారంభమైనప్పటి నుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఒక వర్గం మీడియా తనమీద పనికట్టుకొని లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందని, ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా వార్తలనిస్తున్నరాన్నారు. సీబీఐ విచారణ పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తన విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డింగ్ కు అనుమతించాలని, తనతోపాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతించాలంటూ తాజాగా ఆయన సీబీఐకి లేఖ రాశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు ఏపీలో సజావుగా సాగడంలేదని, వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంలో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేసును తెలంగాణకు బదిలీ చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఫైల్స్ ను హైదరాబాద్ ప్రిన్సిపల్ సీబీఐ కోర్టుకు తరలించారు. కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి దస్త్రాలన్నింటినీ హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తరలించారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్, దస్తగిరిపై ప్రధాన ఛార్జిషీట్, దేవిరెడ్డి శంకర్రెడ్డిపై అనుబంధ ఛార్జిషీట్ను సీబీఐ కడప జిల్లా సెషన్స్ కోర్టులో గతంలోనే దాఖలు చేసింది.