YS Avinash Reddy : అవినాష్ రెడ్డికి మరో నోటీసు ? అప్పుడు ఆలోచిస్తా-మీ కుటుంబాల్లో ఇలాగే..
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ వేగం పుంజుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో తెలంగాణకు విచారణ మారిన తర్వాత సీబీఐ జోరు పెంచింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసులో అనుమానాలతో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారణకు నోటీసులు ఇచ్చింది. అయితే తనకు గడువు కావాలని కోరిన అవినాష్ రెడ్డి.. ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ అవినాష్ కు సీబీఐ నోటీసులు
బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఆయన పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసిన సీబీఐ.. తాజాగా ఆయన్ను హైదరాబాద్ లో ఇవాళ విచారణకు రావాలని నోటీసులు పంపింది. హైదరాబాద్ లో విచారణకు హాజరై.. ఈ హత్య కేసులో తనకు తెలిసిన విషయాలు చెప్పాలని కోరింది. దీంతో ఈ వ్యవహారం అధికార వైసీపీలో కలకలం రేపుతోంది. అయితే సీబీఐ నోటీసులపై అవినాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
ఐదురోజుల తర్వాత వస్తా..
సీబీఐ విచారణకు ఒక్క రోజు ముందు నోటీసులు ఇచ్చి రమ్మంటే ఎలా అంటూ అవినాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తనకు ముందుగా కమిట్ అయిన నాలుగు ప్రోగ్రామ్స్ ఉన్నాయంటూ సీబీఐకి బదులిచ్చారు. ఐదు రోజుల తర్వాత ఎప్పుడైనా హాజరవుతారనంటూ సీబీఐ నోటీసులకు సమాధానం పంపారు. అలాగే సీబీఐకి ఈ విషయంలో పూర్తిగా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మరో సంకేతం కూడా పంపారు. దీనిపై సీబీఐ స్పందించాల్సి ఉంది. అయితే ఆ లోపే అవినాష్ సీబీఐ నోటీసులపై ఈసారి బహిరంగంగా స్పందించారు.
మరో నోటీసు వస్తుంది..ఆలోచిస్తా..
నిన్న సీబీఐ అధికారులు పులివెందులలో విచారణ కోసం వెళ్లారు. అనంతరం వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆయన లేకపోవడంతో పీఏ రాఘువరెడ్డికి ఇచ్చారు. అయితే నోటీసులపై స్పందించి ఇవాళ రాలేను, ఐదు రోజుల తర్వాత వస్తానంటూ బదులిచ్చిన అవినాష్.. ఇవాళ మాత్రం తనకు ముందుగా అనుకున్న ప్రోగ్రామ్స్ ఉన్నాయని, సీబీఐ నుంచి మరో నోటీసు వస్తుందని, ఆ తర్వాత ఆలోచిస్తానంటూ కూల్ గా వ్యాఖ్యానించారు. దీంతో సీబీఐ విచారణకు హాజరయ్యే ఉద్దేశం ఆయనకు ఉందా లేదా అన్న దానిపై చర్చ జరుగుతోంది.
నోటీసులపై అవినాష్ ఎమోషనల్ కామెంట్స్
సీబీఐ నోటీసులపై ఇవాళ స్పందించిన వైఎస్ అవినాష్ రెడ్డి భావోద్వేగంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. రెండున్నరేళ్లుగా తనపై అసత్య ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. తనపై వచ్చిన అభియోగాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. తానేంటో ప్రజలకు తెలుసన్నారు. న్యాయం గెలవాలి, నిజం వెల్లడి కావాలన్నదే తన థ్యేయమన్నారు. నిజం తేలాలని భగవంతుడ్ని కోరుకుంటున్నానన్నారు.అంతే కాదు ఆరోపణలు చేశావారు మరోసారి ఆలోచించాలని అవినాష్ కోరారు. ఇలాంటి ఆరోపణలు చేస్తే మీ కుటుంబ సభ్యులు ఎలా ఫీలవుతారో ఆలోచించండన్నారు. మీ కుటుంబాల్లో ఇలాగే జరిగితే జీర్ణించుకోగలరా అని ప్రశ్నించారు.