ఆసక్తికరంగా కడప రాజకీయాలు: జమ్మలమడుగు నుంచి టీడీపీ బరిలో నిలిచేదెవరు..?
కడప జిల్లాలో రాజకీయం హీట్ ఎక్కుతోంది. ముఖ్యంగా అది వైసీపీ అధినేత వైయస్ జగన్ సొంత జిల్లా కావడంతో ఆ జిల్లాకు ప్రాముఖ్యత మరింత పెరిగింది. కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. దాదాపు తొమ్మిది నియోజకవర్గాల్లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మిగిలిన ఒక్క స్థానంపైనే అందరి దృష్టి ఉంది. అదే మంత్రి ఆదినారాయణ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గం. ముందు నుంచి రాష్ట్ర రాజకీయాల్లో జమ్మలమడుగుకు ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి రెండు కుటుంబాలదే పైచేయిగా ఉంటూ వస్తోంది. కొన్ని దశాబ్దాలుగా జమ్మలమడుగు నియోజక వర్గంలో రెండు కుటుంబాలదే ఆధిపత్యంగా ఉంటూ వస్తోంది. ఒకటి పొన్నపురెడ్డి కుటుంబం అయితే రెండవది దేవగుడి కుటుంబం.
జమ్మలమడుగు అంటే ఆ రెండు కుటుంబాలదే..!
పొన్నపురెడ్డి శివారెడ్డి.. రాష్ట్ర రాజకీయాలతో పరిచయమున్న ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలుసు. ఒకప్పుడు జమ్మలమడుగులో ఆయనదే హవా ఉండేది. ఆయన ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురైన తర్వాత ఆయన వారసుడిగా పొన్నపు రెడ్డి రామసుబ్బారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రామసుబ్బారెడ్డి సౌమ్యుడనే పేరుంది. టీడీపీకి చంద్రబాబుకు ఎంతో నమ్మకస్తుడిగా ఉంటూ రామసుబ్బారెడ్డి రాజకీయాలు చేశారు. దేవగుడి కుటుంబం పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమనేలా శతృత్వం ఉండేది. కానీ మారుతున్న కాలం, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది రామసుబ్బారెడ్డి వర్గానికి మింగుడుపడలేదు. అయినప్పటికీ చంద్రబాబు మాటకు గౌరవమిచ్చి రామసుబ్బారెడ్డి సర్దుకు పోయారు.
ఈ సారి జమ్మలమడుగులో ఏ పార్టీ నుంచి ఎవరు..?
కడప జిల్లా మొత్తం మీద జమ్మలమడుగు నియోజకవర్గమే చాలా ఆసక్తికరంగా మారింది. ఇక్కడ టీడీపీ నుంచి మరోసారి మంత్రి ఆదినారాయణ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. మరి అలాంటి సమయంలో రామసుబ్బారెడ్డి పరిస్థితి ఏమిటని ఆయన క్యాడర్లో సందిగ్ధత నెలకొంది. ఒకవేళ అదే జరిగితే... కచ్చితంగా ఆదినారాయణ రెడ్డి ఓటమికే వారంతా కలిసి పనిచేస్తారనేది జమ్మలమడుగులో వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ నుంచి మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి బరిలో నిలుస్తారనే వార్త కూడా ఉంది. కానీ అధినేత జగన్ మనసులో మాత్రం రామసుబ్బారెడ్డిని వైసీపీ నుంచి బరిలో దించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జమ్మలమడుగు వైసీపీ ఇంఛార్జ్గా ఉన్న సుధీర్ రెడ్డి కూడా తన సన్నిహితుల వద్ద వైసీపీ టికెట్ రామసుబ్బారెడ్డికే అంటూ చెప్పుకుంటున్నారట. దానికి సంబంధించిన ఆడియో టేపులు కూడా బయటపడ్డాయి.
జమ్మలమడుగు నాదంటే నాది: మంత్రి ఆది వర్సెస్ రామసుబ్బారెడ్డి
ఎంపీగా మంత్రి ఆదినారాయణ రెడ్డి..?
ఇదిలా ఉంటే మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడప ఎంపీ స్థానానికి పోటీచేయించే యోచనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఆదినారాయణ రెడ్డి పోటీ పార్లమెంటుస్థానానికి పోటీ చేస్తే... అతని కుమారుడు జమ్మలమడుగు ఎమ్మెల్యేగా బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రామసుబ్బారెడ్డి వర్గం ఇందుకు ససేమిరా అంటోంది. ఒకవేళ ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేస్తేనే సహకరించే పరిస్థితి అక్కడ కనిపించడం లేదు. పైగా జమ్మలమడుగులో వైసీపీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరలేదు. ఆదినారాయణ రెడ్డితో పాటు అతని అనుచరులు మాత్రమే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. క్యాడర్ మాత్రం జగన్ వెంటే ఉన్నట్లు చెబుతోంది. ఒకవేళ రామసుబ్బారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తే తాము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ క్యాడర్ చెబుతోంది.
నియోజకవర్గంలో పట్టుబిగిస్తున్న సుధీర్ రెడ్డి
ప్రస్తుతం జమ్మలమడుగు వైసీపీ ఇంఛార్జ్గా ఉన్న సుధీర్ రెడ్డి కూడా చాలా యాక్టివ్గా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ తన క్యాడర్ను పెంచుకునే పనిలో పడ్డారు. నిత్యం ఆ నియోజకవర్గంలోనే కనిపిస్తున్నారు. అయితే వైసీపీకే చెందిన మరో మహిళా నాయకురాలు అల్లె ప్రభావతి సుధీర్ రెడ్డి వర్గీయులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దీంతో అల్లెప్రభావతికి సుధీర్ రెడ్డిల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. సుధీర్ రెడ్డి సొంతూరు యర్రగుంట్లలో అల్లెప్రభావతి జోక్యం చేసుకోవడంపై గుర్రుగా ఉన్నారు. ఒకవేళ తనకు టికెట్ రాకుంటే జమ్మలమడుగు వైసీపీ టికెట్ రామసుబ్బారెడ్డికే అని సుధీర్ రెడ్డి చెబుతున్న ఆడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుండటంతో రామసుబ్బారెడ్డి వైసీపీ వైపు చూస్తున్నారన్న వార్తలకు బలం చేకూరుస్తోంది.
రామసుబ్బారెడ్డి అంటే అక్కడి ప్రజల్లో సాఫ్ట్ కార్నర్
ప్రస్తుతం టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఉన్నారు. ఆదినారాయణ రెడ్డితో పోలిస్తే రామసుబ్బారెడ్డికి ఆర్థిక బలం లేకపోయినప్పటికీ... ఆయన్ను అభిమానించే వారు జమ్మలమడుగులో చాలా మంది ఉన్నారు. పార్టీలకతీతంగా రామసుబ్బారెడ్డి అంటే ఒక సాఫ్ట్ కార్నర్ జమ్మలమడుగు ప్రజల్లో ఉంది. ఒకప్పుడు ఫ్యాక్షన్ నియోజకవర్గంగా ముద్రపడిన జమ్మలమడుగు... రామసుబ్బారెడ్డి ఆనాడు మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే ఆనియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేశారని అక్కడి ప్రజలు చెబుతుంటారు. ఇక రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వస్తానంటే తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్న సంకేతాలు కూడా పార్టీ నుంచి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ నాయుడుపై కూడా రామసుబ్బారెడ్డి వర్గం కాస్త అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి జమ్మలమడుగు నియోజకవర్గంలో రెండు ప్రధాన రాజకీయ కుటుంబాల భవిష్యత్ ఎలా ఉండబోతోంది... టీడీపీ అధినేత టికెట్ ఎవరికి ఇస్తారు... ఒకరిని కాదని మరొక కుటుంబానికి ఇస్తే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేది తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.