సూపర్ పోలీస్! విద్యార్థిని భుజాన వేసుకుని అడవిలో రెండు కిలోమీటర్లు కాలినడక!
కడప: కడపకు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ చేసిన సాహసానికి సోషల్ మీడియా సలాం కొడుతోంది. ఆయనను సూపర్ పోలీస్గా ఆకాశానికెత్తేస్తోంది. ఇంతకీ ఆయన చేసిన సాహసమేంటీ? తేనెటీగల దాడిలో గాయపడి, ప్రాణాపాయ స్థితికి చేరుకున్న ఓ విద్యార్థిని తన భుజాల మీద వేసుకుని రెండు కిలోమీటర్ల దూరం అడవిలో నడిచారు. సకాలంలో ఆ విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. అతని ప్రాణాలను నిలబెట్టగలిగారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం కడప శివార్లలోని పుట్లంపల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
కడప ఇందిరానగర్కు చెందిన మణికంఠ అనే విద్యార్థి పదవ తరగతి చదువుతున్నాడు. శనివారం వారాంతపు రోజు కావడంతో తన స్నేహితులతో కలసి కడప శివార్లలో పుట్లంపల్లి సమీపంలోని పాలకొండలు అడవికి వెళ్లాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పాలకొండల వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నాయి. దీనితో స్నానం చేయడానికి మణికంఠ, అతని స్నేహితులు వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు. అక్కడున్న ఓ పెద్ద చెట్టుకు తేనెపట్టు కనిపించింది. స్నేహితుల్లో ఒకరు ఆ తేనెతుట్టెపైకి రాయిని విసిరాడు. అది తగిలి తేనెటీగలు దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునే క్రమంలో- మణికంఠ కాలుజారి వాటర్ఫాల్స్ పైనుంచి కింద పడ్డాడు. అతని కాలికి ఫ్రాక్చర్ అయింది.
కిందపడ్డ మణికంఠను తేనెటీగలు చుట్టుముట్టాయి. సంఘటనాస్థలం నుంచి తప్పించుకుని వచ్చిన మణికంఠ స్నేహితులు ఈ విషయాన్ని పుట్లంపల్లి గ్రామస్తులకు తెలిపారు. వెంటనే వారు రిమ్స్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ విద్యాసాగర్ హుటాహుటిన జీపులో పాలకొండల వాటర్ఫాల్స్కు బయలుదేరి వెళ్లారు. వాటర్ ఫాల్స్ వరకూ జీపు వెళ్లేలేకపోవడంతో.. దాన్ని అక్కడే వదిలేసి, సుమారు రెండుకిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లారు. మణికంఠను భుజాల మీద వేసుకుని, మళ్లీ రెండు కిలోమీటర్లు వెనక్కి వచ్చారు. జీపులో అతణ్ని ఎక్కించుకుని రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం మణికంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.