ఢిల్లీలో పోరాడుతాం: జేసీ, అడిగిందే అడుగుతారా.. నా లేఖ ఇవ్వండి: బాబు
Recommended Video
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి బీరేంద్ర సింగ్ పైన టీడీపీ ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం ఆయనతో వారు కడప స్టీల్ ప్లాంట్ విషయమై భేటీ అయిన విషంయ తెలిసిందే. కేంద్రమంత్రితో ప్రధాని నరేంద్ర మోడీ మాటలు చెప్పించారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేష్తో మాట్లాడమని చెప్పినా వినలేదన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ రాజకీయంతో ముడివడిన అంశమన్నారు.
కడప స్టీల్ ప్లాంట్ పైన కేంద్రం చిత్తశుద్ధిని శంకించాల్సిందేనని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమపై ఢిల్లీలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తాము ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపామన్నారు. రేపు (గురువారం) మళ్లీ కేంద్రమంత్రిని కలుస్తామని చెప్పారు. కేంద్రమంత్రితో భేటీ అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
స్టీల్ ప్లాంట్: కేంద్రమంత్రితో టీడీపీ ఎంపీలు భేటీ, 'అది జగన్కు ఎలా తెలిసింది'
సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారని చెప్పినా పట్టించుకోలేదు
కడప స్టీల్ ప్లాంట్పై కేంద్ర ఉక్కు శాఖమంత్రి బీరేంద్ర సింగ్ చేసిన ప్రకటన అసంతృప్తి కలిగించిందని టీడీపీ ఎంపీలు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కోరిన సమాచారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నా స్పష్టమైన హామీ ఇవ్వలేదన్నారు. కాల వ్యవధితో కూడిన హామీ ఇవ్వలేదన్నారు. దీక్ష చేస్తున్న ఎంపీ సీఎం రమేశ్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పినా మంత్రి పట్టించుకోలేదన్నారు. ఉద్యమాన్ని మరింత తీవ్ర తరం చేసి ఉక్కు కర్మాగారాన్ని సాధిస్తామన్నారు.
ఆ ప్రశ్నలకు సమాధానం కావాలన్నారు
ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న సీఎం రమేష్ పరిస్థితి విషమంగా ఉందని కొనకళ్ల నారాయణ అన్నారు. ఢిల్లీకి వచ్చి సంప్రదింపులు జరిపినా స్పష్టమైన హామీ పొందలేదన్నారు. ఉక్కు పరిశ్రమపై తాము సరైన స్పష్టత రాలేదన్నారు. కేంద్రమంత్రి ప్రకటనతో సంతృప్తి లేదన్నారు. రాష్ట్రం నుంచి 9 ప్రశ్నలకు గాను 7 ప్రశ్నలకు సమాధానం వచ్చిందని, రెండింటికి రావాల్సి ఉందని కేంద్రమంత్రి తమతో చెప్పారని, 24 గంటల్లో ఆ సమాచారం పంపిస్తామని తెలిపారు. ఏపీ నుంచి పెండింగ్ లేదన్నారు. కేంద్రమంత్రి తాజా ప్రకటన నెపాన్ని రాష్ట్రంపై నెట్టి మరింత కాలయాపన చేసే ప్రయత్నంగా కనబడుతోందని ఎంపీ రవీంద్ర కుమార్ అన్నారు. 9 అంశాలకు గాను రెండింటిలో స్పష్టత లేదని కేంద్రమంత్రి చెప్పారని, అయితే, రాష్ట్రం నుంచి గతంలోనే వివరణ ఇచ్చామన్నారు. క్లారిటీ లేదనుకున్నప్పుడు ఇంతవరకు ఎందుకు మకు లేఖ రాయలేదన్నారు.
అడిగిందే అడుగుతారా, నేను లేఖ రాస్తా.. ఇవ్వండి
కేంద్రమంత్రి రెండు ప్రశ్నలకు సమాధానం రాలేదనడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడిగిన ప్రశ్నలే రెండు, మూడుసార్లు అడుగుతూ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం తాత్సారం చేస్తోందన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లిన ఎంపీలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కేంద్రమంత్రితో చర్చల సారాంశాన్ని చంద్రబాబుకు వివరించిన జేసీ.. ఉక్కు పరిశ్రమపై ఢిల్లీలో ఆందోళన ఉద్ధృతం చేస్తామన్నారు. గురువారం మళ్లీ కేంద్రమంత్రిని కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. కేంద్రమంత్రికి తాను మరో లేఖ రాస్తానని, రేపటి భేటీలో ఆ లేఖను ఆయనకు అందజేయాలన్నారు.
ఎందుకు ఇలా తాత్సారం
2020లోగా మూడు గనులు రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణలోకి వస్తాయని, ప్రస్తుతం ఇచ్చిన భూముల్లో 87 మిలియన్ టన్నుల ఖనిజం ఉందని చంద్రబాబు అన్నారు. మూడు గనులు అందుబాటులోకి వస్తే 266 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉంటాయన్నారు. ఉక్కు పరిశ్రమ పెట్టేందుకు 150 మిలియన్ టన్నులు ఉంటే సరిపోతుందన్నారు. 116 మిలియన్ టన్నుల నిక్షేపాలు ఉంటే ఇంకా కేంద్రానికి అభ్యంతరం ఎందుకన్నారు. ఉక్కు దీక్ష ప్రారంభమయ్యాక కేంద్రం మరో రెండు కొత్త కొర్రీలు వేసిందని, మొన్నటి దాకా తెలంగాణ ప్లాంట్పై స్పష్టత లేదన్నారన్నారు. బయ్యారం భూములు, నీళ్ల వివరాలు రాలేదన్నారని తెలిపారు. కడపలో రాష్ట్రం ఇచ్చే భూములపై ఏ వివాదమూ లేదన్నారు.