అంతలోనే ఇలా.. చంద్రబాబుకు షాక్!: వైసీపీలోకి కడప టీడీపీ కీలక నేత, ఎందుకంటే?
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు షాక్ మీద షాక్ తగులుతోంది. కడప జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగలనుంది.
టీడీపీని వీడేందుకు ఖలీల్ భాషా సిద్ధం
మాజీ మంత్రి, టీడీపీ నేత ఖలీల్ భాషా టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. రెండు రోజుల్లో ఆయన వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. మంగళవారం నాడు సాయంత్రం హైదరాబాదులోని లోటస్ పాండులో జగన్తో భేటీ కానున్నారని తెలుస్తోంది. ఎల్లుండి కడపలో శంఖారావం సభ జరగనుంది. ఆ సమయంలో అధికారికంగా వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.
అహ్మదుల్లా టీడీపీలో చేరడం వల్లే
కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఆయన కడప అసెంబ్లీ నియోజకవర్గంకు పోటీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఖలీల్ బాషా టీడీపీని వీడనున్నారని తెలుస్తోంది. ఖలీల్ భాషా టీడీపీని వీడుతున్నారనే విషయం తెలిసి టీడీపీ నేతలు రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. కానీ వైసీపీలోకి వెళ్లాలనే నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
అంతలోనే టీడీపీకి షాక్
2014 ఎన్నికల్లో కడప జిల్లాలో టీడీపీ కేవలం రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే గెలిచింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి టీడీపీ నుంచి గెలిచారు. వైసీపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిని ఓడించడం అప్పుడు సంచలనంగా మారింది. దీంతో కడపలో వైసీపీ లేదా వైయస్ కుటుంబం బలం క్రమంగా తగ్గుతోందనే వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలో హఠాత్తుగా టీడీపీ ఎమ్మెల్యే ఇప్పటికే వైసీపీలో చేరడం, మరో కీలక మైనార్టీ నేత రెండ్రోజుల్లో జగన్ వైపు వెళ్లనుండటం గమనార్హం.