చంద్రబాబు నమ్మకద్రోహి: ‘దేవుడు’ అంటూ బాలకృష్ణపై కదిరి బాబూరావు సంచలన వ్యాఖ్యలు
అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబూరావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రముఖ సినీటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై ప్రశంసలు కురిపించారు.
కనిగిరిలో గెలిచినా.. చంద్రబాబు అలా చేశారు..
తన మొదట ఓటు టీడీపీ వేశానని, టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలోనే ఉన్నానని బాబూరావు తెలిపారు. టికెట్ ఇవ్వడంతో 2014లో కనిగిరి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసినట్లు తెలిపారు. బాలకృష్ణకు సన్నిహితుడిగా కూడా ఉన్నందున ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటీ చేశానని చెప్పారు. అయితే, ప్రకాశం జిల్లాలోని పశ్చిమప్రాంతంలో వైసీపీ అభిమానులు ఎక్కువగా ఉంటారని, అది వైసీపీకి కంచుకోట అని తెలిపారు. కానీ, 2014 ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీ నుంచి పోటీ చేసి 12వేల మెజార్టీతో గెలుపొందినట్లు చెప్పుకొచ్చారు. అయితే, 2019 ఎన్నికల్లో తనకు ఎలాంటి విషయం చెప్పకుండా కనిగిరి నుంచి తనను దర్శి నియోజకవర్గానికి పంపించారని టీడీపీ అధిష్టానంపై మండిపడ్డారు. ఇలా ఎందుకు చేశారని, తనను కనిగిరి నుంచి ఎందుకు తప్పించారని చంద్రబాబును ప్రశ్నిస్తే.. కులాల గురించి మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పారు.
చంద్రబాబు వల్లే ఓడిపోయా..
వైసీపీ వాళ్లు పశ్చిమ ప్రాంతంలో ఇద్దరు కాపు నాయకులైన మద్దిశెట్టి వేణుగోపాల్, ఆమంచి కృష్ణమోహన్లకు టికెట్లు ఇచ్చారని.. అందుకే దర్శి నుంచి పోటీ చేయాలని
చంద్రబాబు సూచించారని తెలిపారు. కులాల గురించి చెప్పేపనైతే 2014లో ఎలా గెలతిచాను అని ప్రశ్నిస్తే.. ఈసారి తన మాట వినాలని చంద్రబాబు తేల్చి చెప్పారని తెలిపారు. దర్శిలో మద్దిశెట్టి వేణుగోపాల్ తన కజిన్ అని, ఆయనపై పోటీ ఏంటని చంద్రబాబు ప్రశ్నిస్తే.. రాజకీయాల్లో బంధుత్వమేంటని చంద్రబాబు అన్నారని బాబూరావు తెలిపారు. దర్శి నుంచి పోటీ చేయాలని.. ఒకవేళ ఓడిపోతే ఎమ్మెల్సీ చేస్తానని, కనిగిరి ఇంఛార్జీ పదవిని తిరిగి ఇస్తానని చంద్రబాబు చెప్పారని తెలిపారు. చంద్రబాబు చెప్పినట్లుగా దర్శి నుంచి పోటీ చేసి ఓడిపోయానని వాపోయారు.
బాలకృష్ణ మాటకు విలువలేదు..
కాగా, ఈ విషయంలో నందమూరి బాలకృష్ణ చెప్పిన మాటను చంద్రబాబు కనీసం పట్టించుకోలేదని బాబూరావు తెలిపారు. ఎన్నికల తర్వాత తిరిగి తనను కనిగిరి ఇంఛార్జీగా ప్రకటించాలని కోరితే.. దాటవేస్తున్నారని చంద్రబాబుపై ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే చంద్రబాబుపై నమ్మకం ద్రోహం చేశారనే ఆరోపణలు చేయాల్సి వచ్చిందన్నారు. చంద్రబాబు కారణంగానే తాను టీడీపీకి దూరమవ్వాల్సి వచ్చిందన్నారు.
ఎన్టీఆర్, బాలయ్యలు దేవుళ్లు..
తనకు బాలకృష్ణను విడిచి వెళ్లాలంటే బాధగా ఉందని కదిరి బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. బాలయ్య చాలా మంచివారని చెప్పారు. ఎన్టీఆర్, బాలకృష్ణల వ్యక్తిత్వం వేరని.. నారా వారి వ్యక్తిత్వాలు వేరని అన్నారు. ఎన్టీఆర్, బాలయ్యలు దేవుళ్లలాంటి వారన్న బాబూరావు.. చంద్రబాబు మాత్రం నమ్మకద్రోహి అని దుయ్యబట్టారు. బాలయ్యను కూడా చంద్రబాబు మోసం చేస్తారని, దాన్ని బాలయ్య గుర్తించాలన్నారు.
అందుకే జగన్ పార్టీలోకి..
చంద్రబాబు లాంటి వ్యక్తి దగ్గర ఇమడలేకే తాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెబితే ఆ మాటకు కట్టుబడి ఉంటారని, అందుకే తాను ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమైనట్లు బాబూరావు తెలిపారు. తాను ఎలాంటి పదవులు ఆశించి వైసీపీలో చేరలేదని స్పష్టం చేశారు.