మెదక్లో కాజల్ ఓటరు, ప్రచారం మాని బిజెపికి బాబు..
హైదరాబాద్/మెదక్: మెదక్ జిల్లాలో ఓటరు నమోదులో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగరాయిలో సిని నటీ కాజల్ అగర్వాల్ ఓటరుగా నమోదయ్యారు. జాబితోల ఆమె పేరు చూసిన స్థానికులు మీడియాకు తెలిపారు.
నిర్లక్ష్యం కారణంగా గతంలోను పలుమార్లు పలువురు సినీ నటులు, ఇతర ప్రముఖులు ఆయా గ్రామాల్లో ఓటర్లుగా నమోదైనట్లుగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
బిజెపికి ఓటేసేందుకు వచ్చిన చంద్రబాబు!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తన ఓటు హక్కును ఈసారి భారతీయ జనతా పార్టీకి వేయనున్నారు! ఈ సార్వత్రిక ఎన్నికలలో టిడిపి, బిజెపిలు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చంద్రబాబు నివాసం ఉన్న నియోజకవర్గం బిజెపి అభ్యర్థులు నిలబడిన వాటి కిందకు వస్తుంది.
చంద్రబాబు నివాసం ఖైరతాబాద్ శాసన సభ స్థానంలో ఉంది. పొత్తులో భాగంగా చంద్రబాబు నివాసం ఉంటున్న ఖైరతాబాద్ శాసన సభ నియోజకవర్గం, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీంతో చంద్రబాబు కమలానికి ఓటు వేయనున్నారు. బిజెపికి ఓటేసేందుకు ఆయన సీమాంధ్రలో ప్రచారం మానుకొని హైదరాబాద్ వచ్చారు.