హీరో అవుదామనే కానీ: బాబుపై కాకాణి నిప్పులు, ‘ఇంతమంది కాళ్లుపట్టుకున్నది యూటర్న్ అంకులే’
విజయవాడ: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చట్టసభల్లో జరిగిన తీర్మానాలను గౌరవించే అలవాటు చంద్రబాబుకు మండిపడ్డారు.
ప్రత్యేక హోదాపై 2014 మార్చి 2న కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకుందని, పార్లమెంట్లో స్వయంగా అప్పటి ప్రధాని ఈ మేరకు హామీ ఇచ్చారని చెప్పారు. ప్రత్యేక హోదా కావాల్సిందేనని రెండు సార్లు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. వీటన్నింటికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా 2016 సెప్టెంబరు 8న చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకారం తెలిపారని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హీరో అవుదామని బాబు..
చీకటి ఒప్పందాల కోసం చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టారని కాకాణి ఆరోపించారు. ఇప్పుడు అధికారం చేజారుతుందనే భయంతో ప్రత్యేక హోదా గళమెత్తి కొత్త పలుకులు పలుకుతున్నారని, అఖిలపక్షం అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని అన్నారు. ఈ డ్రామాతో తానే హీరో అవుదామని చంద్రబాబు తాపత్రయం పడుతున్నారని ఎద్దేవా చేశారు.
బాబు మీద ఆగ్రహం
అయితే, ప్రజల దృష్టిలో మాత్రం రాష్ట్రానికి చేసిన అన్యాయానికి చంద్రబాబు విలన్గానే మిగిలిపోయారని అన్నారు. అఖిలపక్షం భేటిలో 60 మంది కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో మాట్లాడారని చంద్రబాబు చెబుతున్నారని, ఆ ఆగ్రహం ఆయన మీదే అన్న విషయం బాబుకు అర్థం కావడం లేదని చెప్పారు.
బాబుకు సిగ్గు అనిపించడం లేదా?
అఖిలపక్ష భేటీని మూడు పార్టీలు బహిష్కరించినందుకు చంద్రబాబు ఏ మాత్రం సిగ్గపడటం లేదని కాకాణి విమర్శించారు. పార్టీ ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, గెలిపించుకునే సత్తా టీడీపీ లేదని అన్నారు.
రాజ్యాంగ విలువలు పాటించని సభలో ప్రతిపక్షం ఎలా కూర్చుంటుందని ప్రశ్నించారు.
బాబు ఎందరి కాళ్లు పట్టుకున్నారంటే..
ప్రధానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నమస్కారం చేస్తే తప్పు.. అదే టీడీపీ వెన్నుపోటు పొడిస్తే ఒప్పు.. అన్నట్లు చంద్రబాబు వైఖరి ఉందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ కాళ్లు పట్టుకున్నారని బాబుపై ఆరోపణలు చేశారు. మట్టి, నీరు ఇచ్చినప్పుడు మోడీ కాళ్లు పట్టుకున్నారని, రాజకీయ లాభం కోసం ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నారని.. పోలవరం పనుల కోసం గడ్కరీ కాళ్లు పట్టుకున్నారని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.
బాబు జీర్ణించుకోలేకపోతున్నారు..
ఇది ఇలా ఉండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పథకం ప్రకారమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డిపై తమ పార్టీ నాయకులతో మాటల దాడి చేయిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించడం కోసం పార్లమెంట్లో కీలకంగా వ్యవహరిస్తున్న విజయసాయి రెడ్డి తీరును బాబు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.
బాబు యూటర్న్ అంకులే
చంద్రబాబుతో పాటు టీడీపీ ఎంపీల అవినీతి భాగోతాన్ని విజయసాయి రెడ్డి ఎక్కడ బయటపెడతారో అన్న భయం తెలుగు దేశం పార్టీకి, నాయకులకు నిద్రలేకుండా చేస్తుందని విమర్శించారు. ముఖ్యమంత్రి ఏది చేప్తే అది ఊదరగొట్టే ఎల్లో మీడియాతో ప్రత్యేక హోదా కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న విజయసాయి రెడ్డిపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై పూటకో మాట మాట్లాడే చంద్రబాబును యూటర్న్ అంకుల్ అనడంలో తప్పు లేదని భూమన కరుణాకర్ తేల్చి చెప్పారు.