ఈ మత్స్యకారులే మృత్యుంజయులు:నడిసంద్రంలో తిండితిప్పలు లేక నరకయాతన
తూర్పుగోదావరి:కాకినాడ మున్సిపాలిటీ పరిధి దుమ్ములపేట నుంచి సముద్రంలో చేపలవేటకు వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు ఎట్టకేలకు క్షేమంగా ఇల్లు చేరారు.
నడి సముద్రంలో తుపానులో చిక్కుకొని 5 రోజుల పాటు నరకయాతన అనుభవించిన ఈ మత్స్యకారులు అన్ని రోజులూ తమని నీడలా వెంటాడిన మరణాన్ని గెలిచి చివరకు మృత్యుంజయులుగా బైటపడ్డారు. కాకినాడ నుంచి చేపటవేటకు వెళ్లిన వీరు 9 రోజుల తర్వాత బ్రతుకు జీవుడా అనుకుంటూ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని మంచినీళ్లపేట వద్ద ఒడ్డుకు చేరుకొన్నారు. తిండీతిప్పలు లేకుండా సముద్రంలో తాము అనుభవించిన దుస్థితి పగవాడికి కూడా రాకుడదంటున్న మత్స్యకారులు తమ జీవన పోరాటం వివరాలు మీడియాతో పంచుకున్నారు.
ఏడుగురు మత్స్యకారులు...చేపల వేట
కాకినాడ పురపాలక సంఘం పరిధిలోని దుమ్ములపేటకు చెందిన ఎరిపిల్లి సత్తిబాబు, దాసరి కొయిరాజు, మరుపిల్లి సింహాద్రి, గరికిని అప్పారావు, ఎరిపిల్లి లక్ష్మయ్య, గరికిని ఆనందరావు, పేర్ల సత్తిబాబులు కాకినాడకు చెందిన మోషేపేతురుకు చెందిన బోటులో ఈనెల 6 వతేదీ ఉదయం 5 గంటల సమయంలో కాకినాడ తీరం నుంచి చేపలవేటకు బయలుదేరి వెళ్లారు. చేపల వేటకు వెళ్లేప్పుడు వీరు తమ వెంట 6 రోజులకు తగిన ఆహార పదార్థాలు, 400 లీటర్ల డీజిల్ తీసుకెళ్లారు. అలా వెళ్లిన వీరు మూడురోజుల పాటు తమ చేపల వేటను సజావుగానే సాగించి చేపలు పట్టుకున్నారు.
తుఫాన్..చుట్టుముట్టింది
ఎప్పటిలాగానే మరో రెండు రోజుల పాటు చేపల వేట కొనసాగిద్దామనుకుంటున్న క్రమంలో...ఈ నెల 9న సముద్రంలో వాతావరణం ఒక్కసారిగా అనూహ్యంగా మారి బీభత్సంగా తయారైంది. భీకర కెరటాల తాకిడి, పెను గాలుల ప్రభావంతో అదుపు తప్పిన వీరి పడవ ఎటు వెళ్తుందో గమనించే పరిస్థితి లేకపోవడంతో భయాందోళనలకు లోనయ్యారు. తాము ఎటు వెళుతున్నామో...ఇక క్షేమంగా ఒడ్డుకు చేరుతామో లేదో...అన్న భయం మత్స్యకారుల్లో చోటుచేసుకుంది.
Recommended Video
తిండి లేదు...పట్టిన చేపలు తిన్నారు
ఆ క్రమంలో 10వ తేదీ నాటికే వీరు తెచ్చుకున్న ఆహార పదార్థాలు అన్నీ అయిపోయాయి. తినడానికి ఏమీలేని పరిస్థితుల్లో తాము అంతకుముందు వరకు సముద్రంలో పట్టిన చేపలనే తినడం ప్రారంభించారు. అలా ఆ చేపలను నాలుగు రోజుల పాటు తింటూ కడుపునింపుకున్నారు. ఈ క్రమంలో సరైన నిల్వలేని కారణంగా మిగిలిన చేపలు పాడవడంతో వాటిని సముద్రంలోనే పారవేశారు. దీంతో ఇక 13వ తేదీ నుంచి వీరికి తినడానికి తిండే లేకుండా పోయింది...మరోవైపు డీజిల్ కూడా అయిపోయింది...
ఒడ్డుకు చేరాలనే...ఆశ,ప్రయత్నం
అయినా ఎలాగైనా ఒడ్డుకు చేరుకోవాలనే ఆశతో తెరచాప సాయంతో కెరటాల పరిస్థితిని పసిగడుతూ తీరప్రాంతం వైపు పయనం కొనసాగించే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో తుఫాన్ ధాటికి పడవ పలు సార్లు సముద్రంలోకి కొట్టుకువెళ్లేది. అలా ఒడ్డుకు చేరేందుకు విశ్వప్రయత్నం చేస్తూ తమ ప్రాణాలు కాపాడాలంటూ కులదైవం గంగమ్మ తల్లిని స్మరిస్తూ...ఎట్టకేలకు గురువారం మంచినీళ్లపేట తీరం సమీపానికి చేరుకొన్నారు.
ఎట్టకేలకు...సురక్షితంగా
కాకినాడ మత్స్యకారుల గల్లంతు సమాచారం గురించి అప్పటికే అక్కడి స్థానిక మత్స్యకారులకు అందివుండటంతో అక్కడివాళ్లు వీళ్ల బోటును గుర్తించి ఎంఎన్పేటకు చెందిన వంక చిరంజీవి బోటు సాయంతో వీరిని గురువారం సాయంత్రానికి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. అయితే తమ బోటు ఎక్కడా బోల్తాపడే సంఘటన చోటు చేసుకోలేదని...అదే జరిగుంటే లైఫ్ జాకెట్లు లేనందున చాలా ప్రమాదం జరిగి ఉండేదని మత్స్యకారులు ఈ సందర్భంగా చెప్పారు
ప్రాణాలు దక్కినా...తీవ్ర నష్టం...
అయితే చేపల వేట సాగిస్తున్న సమయంలో తుఫాన్ చుట్టుముట్టడంతో సముద్రంలో వేసిన 20 పర్ల వలలను లోపలకు లాగేందుకు వీల్లేక అలాగే వదిలేశామని వీరు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల తమకు సుమారు రూ. 2 లక్షలు నష్టం వాటిల్లిందని, అంతేకాకుండా వేటాడిన చేపల సరకు రూ.1లక్ష పాడైపోయిందని వాపోయారు. అయితే బోటుకు ఎటువంటి నష్టం జరగకపోవడం ఊరట కలిగించిందన్నారు. మత్స్యకారులు తీరం చేరుకొన్న విషయం తెలుసుకొన్న స్థానిక నేతలు పరామర్శించారు. వీరికి వెంకన్నచౌదరి గ్లో సంస్థ ద్వారా రూ.5వేలు ఆర్థికసాయం అందించారు. ఎస్ఐ కె.వి.సురేశ్ మత్స్యకారులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.