కాకినాడలో టీడీపీ, బీజేపీ మధ్య భగ్గుమన్న విభేదాలు, టీడీపీలో న్యాయం జరగదు.. వాపోయిన మహిళా నేత
మేయర్ ఎన్నిక రోజున కాకినాడలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఓ వైపు కార్పొరేటర్లు ప్రమాణం చేస్తుండగా మరోవైపు ఇరుపార్టీల కార్యకర్తలు కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట బాహాబాహికి దిగారు.
కాకినాడ: మేయర్ ఎన్నిక రోజున కాకినాడలో టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఓ వైపు కార్పొరేటర్లు ప్రమాణం చేస్తుండగా మరోవైపు ఇరుపార్టీల కార్యకర్తలు కార్పొరేషన్ ఆఫీస్ ఎదుట బాహాబాహికి దిగారు. టీడీపీ, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాటతో వాతావరణం వేడెక్కింది. క్రమేపీ గొడవ పెద్దది కావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు.
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేశాయి. తొలిసారిగా మేయర్ పీఠం దక్కించుకున్న టీడీపీ 32 స్ధానాల్లో విజయం సాధించగా.. బీజేపీ 9 డివిజన్లలో పోటీ చేసి 3 చోట్ల గెలిచింది. ఈ రోజు జరిగిన వివాదంపై నేతలు ఆరాతీశారు. మేయర్ అభ్యర్థి కోసం వచ్చిన మంత్రులు చినరాజప్ప, పితాని, ప్రత్తిపాటి పుల్లారావు వివాదం గురించి సమాచారం సేకరించారు.
''పార్టీ నన్ను గుర్తించలేదు. ఇది కాపు జాతికే అవమానం..''
కాకినాడ మేయర్ పదవి దక్కడం లేదని తెలిసి కార్పొరేటర్ శేషగిరి కుమారి ఎంపీ తోట నర్సింహంతో వాగ్వివాదానికి దిగారు. సీనియర్ నేతలకు విలువలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ''పార్టీ నన్ను గుర్తించలేదు. ఇది కాపు జాతికే అవమానం. నన్ను కాపు మహిళగా గుర్తించలేదు. లోలోపల మంతనాలు జరిపి పదవులను పంచుకుంటున్నారు. నేను ఏనాడు పదవి కావాలని పార్టీని అడుగలేదు. కానీ ఈ రోజు అడుగుతున్నాను. నాకెందుకు అన్యాయం చేశారు? నాయకులను నమ్ముకుంటేనే పదవులు వస్తాయా? సీఎం చంద్రబాబు నాయకుడు కాదా? టీడీపీ అధిష్టానం తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కచ్చితంగా 2019 ఎన్నికలకు దారితీస్తుంది. ప్రజలు నమ్మి నాకు ఓట్లు వేశారు. నా వార్డుకు నేనే న్యాయం చేసుకుంటాను. కానీ టీడీపీలో న్యాయం జరగదు అనే దానికి ఇదే నిదర్శనం'' అని శేషగిరి కుమారి వాపోయారు.
కాపు సామాజిక వర్గం నుంచే నలుగురు మహిళలు పోటీ...
కాకినాడ మేయర్ పదవి కోసం కాపు సామాజిక వర్గానికి చెందిన నలుగురు మహిళలు పోటీ పడిన విషయం తెలిసిందే. పోటీ పడిన వారిలో అడ్డూరి వరలక్ష్మి, సుంకర పావని, శేషగిరి కుమారి, సుంకర శివప్రసన్న.. ఈ నలుగురు కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో వీరు మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. అయితే ఎట్టకేలకు కాకినాడ మేయర్ అభ్యర్థిగా సుంకర పావని పేరును అధిష్టానం ఖారారు చేసింది. డిప్యూటీ మేయర్గా కాలా సత్తిబాబును ఎంపిక చేశారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పావని 28వ డివిజన్ నుంచి గెలుపొందగా, 2వ డివిజన్ నుంచి సత్తిబాబు విజయం సాధించారు. టీడీపీ ప్రభుత్వం కాపులకు అండగా ఉందనే అభిప్రాయాన్ని కలిగించేందుకు అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.