ఎమ్మెల్యే కొండబాబు ఫెయిల్?: 'డిప్యూటీ' రేపిన చిచ్చు, భగ్గుమంటున్న మత్స్యకారులు..
అటు మేయర్, ఇటు డిప్యూటీ మేయర్ పదవుల్లో ఏది దక్కకపోవడంతో మత్స్యకార వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి.
కాకినాడ: కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల తర్వాత స్థానిక టీడీపీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఎన్నికల్లో సత్తా చాటిన మత్స్యకార వర్గాలను టీడీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.
కాకినాడలో టీడీపీ, బీజేపీ మధ్య భగ్గుమన్న విభేదాలు, టీడీపీలో న్యాయం జరగదు.. వాపోయిన మహిళా నేత
కార్పోరేషన్ ఎన్నికల్లో మత్స్యకార వర్గాలైన వాడబలిజ అగ్నికుల క్షత్రియులు 12మందికి కార్పోరేటర్ సీట్లు కేటాయించగా.. 11మంది విజయం సాధించారు. అయినా సరే పార్టీ మాత్రం వీరిని చిన్నచూపు చూస్తోందనే అపవాదు ఉంది. కాకినాడలో మెజారిటీ వర్గమైన తమనెలా విస్మరిస్తారంటూ మత్స్యకార వర్గాలు ఆరోపిస్తున్నాయి.
డిప్యూటీ కూడా దక్కక:
ఇప్పటికే మేయర్ పదవిని ఓసీ సామాజిక వర్గానికి చెందిన మహిళకు కట్టబెట్టగా.. కనీసం డిప్యూటీ మేయర్ పదవి అయిన తమకు దక్కుతుందని మత్స్యకార వర్గాలు భావించాయి. అయితే ఆ పదవి కూడా తమకు దక్కే అవకాశాలు కనిపించకపోవడంతో వారంతా పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
కొండబాబు వైఫల్యం?:
స్థానిక ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు అలియాస్ కొండబాబు వైఫల్యం వల్లే తమకీ దుస్థితి తలెత్తిందని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. సొంత సామాజిక వర్గానికి ఎలాగూ మేయర్ పదవి ఇప్పటించుకోలేకపోయారు, కనీసం డిప్యూటీ కూడా దక్కేలా చేయకపోతే ఎలా? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై అధిష్టానంతోనే తాడో పేడో తేల్చుకుంటుమని చెబుతున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో మత్స్యకార కార్పోరేటర్లు, ముఖ్య నేతలంతా సమావేశమై తమ అసంతృప్తిని బాహాటంగానే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మత్స్యకారులకు భంగపాటు:
కార్పోరేటర్గా గెలుపొందిన కొండబాబు అన్న కుమారుడు వనమాడి ఉమాశంకర్, సీనియర్ కార్పోరేటర్ చోడిపట్ల సత్యప్రసాద్, మల్లాడి గంగాధర్, చవ్వాకుల రాంబాబు ప్రధానంగా డిప్యూటీ మేయర్ పదవిని ఆశించారు. ఇందులోనే ఉమాశంకర్ పేరే ప్రధానంగా వినిపించినప్పటికీ.. వాడ బలిజ సామాజికవర్గం తమకే డిప్యూటీ మేయర్ పదవి దక్కాలని పట్టుబట్టడంతో మత్స్యకార వర్గానికి మరోసారి భంగపాటు తప్పలేదు.
తలపట్టుకున్న కొండబాబు:
కాకినాడ రూరల్ ఎమ్మల్యే పిల్లి అనంత లక్ష్మి ప్రతిపాదించిన అభ్యర్థికే డిప్యూటీ మేయర్ పదవి ఖరారు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో మత్స్యకార వర్గం అసంతృప్తితో రగులుతోంది. సొంత సామాజిక వర్గానికి పదవులు ఇప్పించుకోలేక .. పార్టీ పెద్దలను ఒప్పించలేక ఎమ్మెల్యే కొండబాబు తలపట్టుకున్నారు. మత్స్యకార వర్గం మాత్రం తమ ఎమ్మెల్యే చేతకాని వైఖరి వల్లే తమ సామాజిక వర్గానికి పదవులు దక్కలేదని వాపోతోంది.