Kakinada: చంద్రబాబుపై పచ్చి బూతులు..లోకేష్ కొవ్వు కరిగించాలని వ్యాఖ్యలు: వైసీపీ ఎమ్మెల్యేపై..!
కాకినాడ: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై బహిరంగంగా పచ్చిబూతులు మాట్లాడిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా ఆయన నోరు జారారు. వేదిక మీదే చంద్రబాబు సహా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్పైనా విరుచుకుపడ్డారు.
మూడు రాజధానుల కోసం..
రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు నిరసనగా అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తోన్న నిరసన ప్రదర్శనలు, ఆందోళనకు తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని వహిస్తోంది. వారి పోరాటానికి దిశా నిర్దేశం చేస్తోంది. ఇందులో భాగంగా- కాకినాడలో చంద్రబాబు కొద్దిరోజుల కిందటే జోలె పట్ట భిక్షాటన కూడా నిర్వహించారు. దీనితో అక్కడి రాజకీయ వాతావరణం వేడెక్కింది. మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ ముసలోడు లేవకూడదంటూ..
వైఎస్ఆర్సీపీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రోడ్డెక్కారు. కాకినాడ లోక్సభ సభ్యురాలు వంగా గీతతో కలిసి రోడ్షో నిర్వహించారు. చంద్రబాబు నాయుడి భిక్షాటనను రాజకీయ స్టంట్గా అభివర్ణించారు ద్వారంపూడి. ఈ సందర్భంగా ఆయన పలు సందర్భాల్లో నోరు జారారు. చంద్రబాబుపై రాయడానికి వీల్లేని భాషను ప్రయోగించారు. జగన్ను చూసి నేర్చుకోవయ్యా చంద్రబాబూ.. అంటూ హితబోధ చేశారు. చంద్రబాబు అనే ఆ ముసలోడు ఇక మళ్లీ లేవకూడదని, దీనికోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిరోజూ కష్టపడాలని అన్నారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ కొవ్వు కరిగించేయాలని సూచించారు.
టీడీపీ కార్యకర్తల ఆగ్రహం..
ద్వారంపూడి చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అధికార మదంతోనే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ద్వారంపూడి సభ ముగిసిన వెంటనే- వారు కాకినాడ నగర పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ద్వారంపూడిపై స్థానిక పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయాలని నిర్ణయించారు. టీడీపీ కాకినాడ నగర కార్యకర్త గుమ్మళ్ల వెంకటేశ్వర రావు కాకినాడ త్రీ-టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు ద్వారంపూడిపై కేసు నమోదు చేశారు.