కాకినాడ-షిర్డీ ఎక్స్ప్రెస్కు తృటిలో తప్పిన పెను ప్రమాదం: ఔరంగాబాద్ వద్ద..!
అమరావతి: కాకినాడ-సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తృటిలో తప్పింది. రైలు కదులుతున్న సమయంలోనే ఇంజిన్ నుంచి బోగీలన్ని విడిపోయాయి. బోగీలు లేకుండానే ఇంజిన్ కిలోమీటర్ దూరం వరకు ప్రయాణించినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోగీలు విడిపోయిన విషయాన్ని గుర్తించిన వెంటనే ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. స్టేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
శనివారం తెల్లవారు జామున 6 గంటలకు కాకినాడ పోర్ట్ నుంచి సాయినగర్ షిర్డీకి బయలుదేరిన ఈ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నానికి సాయినగర్ షిర్డీకి చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యలో ఆదివారం తెల్లవారు జామున ఔరంగాబాద్ వద్ద ప్రమాదానికి గురైంది. ఔరంగాబాద్ స్టేషన్ దాటిన కొద్ది సేపటికే బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. ఆ వేగానికి ఇంజిన్ సుమారు కిలోమీటర్ దూరం పాటు ప్రయాణించినట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించిన వీడియోను ప్రయాణికులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీన్ని రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయెల్, సెంట్రల్ రైల్వే, దక్షిణమధ్య రైల్వే అధికారులకు ట్యాగ్ చేశారు. సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే అధికారులకు చేరవేశారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే రైల్వే అధికారులు స్పందించారు. సంఘటనా స్థలానికి సాంకేతిక సిబ్బందిని పంపించారు. ఇంజిన్ను రప్పించి, బోగీలను అమర్చారు. సుమారు గంట తరువాత రైలు సాయినగర్ షిర్డీకి బయలుదేరి వెళ్లింది.
Near Aurangabad Engine and coach are decoupled at the running condition 😰 #17206 #KakinadaPort #SainagarShirdi #express @PiyushGoyalOffc @Central_Railway @SCRailwayIndia @drmsecunderabad @RailMinIndia pic.twitter.com/7jBN0qUzWD
— Vijay Dhage (@VijayDhage22) March 15, 2020
ఈ ఘటనపై దర్యాప్తును ఆదేశిస్తామని దక్షిణమధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. ఇంజిన్తో బోగీలను అనుసంధించే పనులను పర్యవేక్షించే స్టేషన్ సిబ్బందిని విచారిస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ ఘటన వల్ల సాయినగర్ షిర్డీ ఎక్స్ప్రెస్ ఆలస్యంగా నడుస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని ప్రయాణికులు మండిపడుతున్నారు.