బీటెక్ మధ్యలో ఆపేసి: ఫేస్బుక్తో 500మంది అమ్మాయిలు వలవేసి, మంత్రులు, ఎంపీల పిల్లలు కూడా
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఓ ఫేస్బుక్ చీటర్ను పోలీసులు అరెస్టు చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు వీఐపీలీ, రాజకీయ నేతలకు ప్రేమ పేరుతో వల వేసి కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి వారిని మోసం చేశాడు. ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొని ఇలా దాదాపు 500 మంది అమ్మాయిలను అతను మోసం చేసి ఉంటారని భావిస్తున్నారు.
ఇందులో పలువురు రాజకీయ ప్రముఖుల, వీఐపీల కూతుళ్లు కూడా ఉన్నారని తెలుస్తోంది. అతను వారి నుంచి రూ.2 నుంచి రూ.2.5 కోట్ల మేర వసూలు చేశాడు. నిందితుడి పేరు వంశీకృష్ణ. ఇతను దాదాపు రెండేళ్ల నుంచి అమ్మాయిలకు వల వేసి పెద్ద ఎత్తున మోసం చేశాడు. ఇది తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అతని వలలో మంత్రులు, ఎంపీల పిల్లలు, వారి బంధువుల పిల్లలు కూడా ఉన్నారట.
రెండో పెళ్లి: డ్రైవర్కు సుఫారీ ఇచ్చి భర్త హత్య కేసులో ట్విస్ట్లు, అక్కడే డౌట్
రెండేళ్లుగా అమ్మాయిలకు వల
గత రెండేళ్లుగా సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలకు వల వేస్తూ దగా చేస్తున్నాడు వంశీకృష్ణ. ఫేస్బుక్తో పాటు వాట్సాప్ ద్వారా తానే ముందు హాయ్ అంటూ పలకరిస్తాడు. పరిచయం చేసుకుంటాడు. తన ఫోటోను కాకుండా ఓ అందమైన యువకుడి ఫోటోను పెడతాడు. కొందరు అమ్మాయిలకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని.. ఇలా బుట్టలో వేసుకుంటాడు.
అమ్మాయిలను మభ్యపెట్టి ఖాతాలో డబ్బులు
అమ్మాయిలను మభ్యపెట్టి తన ఖాతాలో డబ్బులు వేయించుకుంటాడు వంశీకృష్ణ. నగలు, బంగారం, డబ్బు అమ్మాయిల నుంచి తీసుకుంటాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ చేస్తాడు. ఇతను కేవలం 45 రోజుల్లోనే 25 సిమ్ కార్డులు మార్చాడు. వంశీకృష్ణ ఇంజినీరింగ్ మధ్యలో మానేశాడు.
సంపన్న కుటుంబమే కానీ ఆస్తులు కరిగిపోయాయి
గత రెండేళ్లుగా అతను మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. ఎట్టకేలకు కాకినాడ పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. అతని గుట్టు రట్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం.. కంబాలచెరువు సమీపంలోని వంశీకృష్ణ అలియాస్ హర్షది ఓ సంపన్న కుటుంబం. వివిధ కారణాలతో ఆస్తులు కరిగిపోయాయి. అధిక శాతం ఇతని నిర్వాకానికే ఆస్తులు పోయినట్లుగా తెలుస్తోంది.
బీటెక్ మధ్యలో ఆపేసి, అందమైన ఫోటో ప్రొఫైల్గా..
2009లో కాకినాడ సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్లో చేరి మధ్యలో ఆపేశాడు. 2014లో హైదరాబాదులో ఓ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. వ్యసనాలకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించే మార్గాన్ని అన్వేషించి, ఉద్యోగం మాని, ఫేస్బుక్, వాట్సాప్లు వేదికగా ప్రయివేటు సంస్థలలో పని చేసే అమ్మాయిలు టార్గెట్గా గాలం వేశాడు. యానాం ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని తన ఫ్రొపైల్ ఫోటోగా ఉపయోగించుకున్నాడు. అమ్మాయిలు వీడియో కాల్ చేయమంటే చేసేవాడు కాదు. కొద్దిమందిని తప్ప ఎవరినీ కలవలేదు. కానీ 500 మంది అతని మాటల వలలో పడిపోయారు. మాయమాటలు చెప్పి, మన్మథ బాణాలు వేసి బుట్టలో వేసుకుంటాడు.
ఇలా గుట్టురట్టు
పోలీసులు మాట్లాడుతూ.. ఓ ఎంబీబీఎస్ అమ్మాయి ఫిర్యాదుతో అతని గుట్టు రట్టయిందని చెప్పారు. ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి, మోసం చేసి ఆమె వద్ద నుంచి దాదాపు 5 కాసుల బంగారం, ఒకటిన్నర కాసుల ఉంగరం, రూ.75వేల నగదు తీసుకొని మోసం చేశాడని ఫిర్యాదు అందిందని చెప్పారు. అందమైన ఫోటో పెట్టుకొని, దాని ద్వారా అమ్మాయిలను పరిచయం చేసుకొని, వారిని మోసగిస్తున్నాడని చెప్పారు. హైటెక్ సిటీలో ఉద్యోగం ఇప్పిస్తానని, మంచి జీవితం ఉండేలా చేస్తానని, చాలామంది అమ్మాయిలను మోసం చేశాడని తెలిపారు.