నేను పర్సనల్ విషయాలు మాట్లాడాలా, చంపేయండి!: పవన్కు బండారు హెచ్చరిక
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు గురువారం బహిరంగ లేఖ రాశారు. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్, కాపు రిజర్వేషన్ బిల్లుపై జనసేనాని కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఇచ్చిన రూ.150 కోట్లు కేంద్రం వెనక్కి తీసుకుంటే అడగలేదేం అన్నారు విశాఖపట్నం గిరిజన వర్సిటీపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
Recommended Video
నాకు తెలుసు.. జగన్ చెల్లినే సహించరు, బీజేపీ గెలుస్తుంది కానీ: మోడీపై జేసీ
రైల్వే జోన్ కోసం టీడీపీ ఎంపీలు విశాఖలో దీక్ష చేస్తే జనసేనాని ఎందుకు సంఘీభావం తెలపలేదని, పైగా విమర్శలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్కు ఉత్తరాంధ్రలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అన్నారు. మరోవైపు, భూ ఆక్రమణల మీద తనపై, తన కొడుకు మీద జనసేనానీ చేసిన ఆరోపణలకు టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి కౌంటర్ ఇచ్చారు.
అలా చేస్తే ఈ పాటికి మీడియా బయటపెట్టేది
తాను, తన కొడుకు పెద్ద ఎత్తున భూమిని ఆక్రమించామని పవన్ చెప్పడం సరికాదని, ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. పవన్కు దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలని సవాల్ విసిరారు. నిజంగా, వందలాది ఎకరాల భూములను తాను ఆక్రమిస్తే ఈ పాటికి మీడియా తనను బయటపెట్టేదన్నారు. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్తో జనసేనాని మాట్లాడుతున్నారని ఆరోపించారు.
వ్యక్తిగతంగా నేను చాలా మాట్లాడగలను
వ్యక్తిగతంగా మాట్లాడాలంటే తాను కూడా చాలా విషయాలు మాట్లాడగలనని, ఈ విషయం పవన్ గుర్తుంచుకోవాలని బండారు హెచ్చరించారు. పవన్ కొత్తగా రాజకీయాలు నేర్చుకున్నారని, తాను చిన్నప్పటి నుంచి రాజకీయాలు నేర్చుకున్నానని చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేశానని, ఇప్పటి వరకు తనపై ఎలాంటి ఆరోపణలు లేవని చెప్పారు. తనను ఇప్పటి వరకు ఎవరూ వేలెత్తి చూపలేదన్నారు. నేను, నా కొడుకు కలిసి వందకోట్ల ఆస్తి సంపాదించామని పవన్ ఆరోపించారని మండిపడ్డారు.
అలా అయితే మీకు ఇష్టమైన శిక్ష వేయండి
గత మూడు పర్యాయాలు తాను ఎమ్మెల్యేగా పోటీ చేసిన సమయంలోని ఎన్నికల డిక్లరేషన్ కావాలంటే పవన్కు పంపిస్తానని బండారు చెప్పారు. 2009, 2014లో కంటే తనకు ఒక ఎకరా, ఒక రూపాయి, ఒక భవనం, ఒక బ్యాంక్ అకౌంట్ ఎక్కువ ఉన్నట్టు పవన్ చూపిస్తే ఆయన ఏం చెప్తే అది చేయడానికి సిద్ధమని, ఆయనకు దాసోహం అంటానని సవాల్ చేశారు. మీకు ఇష్టమైన శిక్ష వేయవచ్చునని చెప్పారు.
నిరూపితమైతే చంపేయండి
తనపై ఆరోపణలు నిరూపితమైతే మీ జనసేన చెప్పినట్లుగా తనని చంపేయాలని బండారు అన్నారు. తాను ప్రాణాలకు భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని, అందుకే వారు తనను ఆదరిస్తున్నారని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలకు పవన్ కమిటీ వేయవచ్చునని చెప్పారు. నేను లేదా నా కొడుకు ఎవరి వద్దకైనా వెళ్లి భూమి కోసం బెదిరించామని ఫిర్యాదు చేసినట్లయినా నిరూపించాలన్నారు.
వాస్తవాలు తెలుసుకో, బాబుపై ఇష్టం వచ్చినట్లు వద్దు
పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు మాటలు మాట్లాడవద్దని బండారు సత్యనారాయణ మూర్తి సూచించారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా ప్రజలు తనను ఆదరించి, గౌరవించారన్నారు. చంద్రబాబుకు క్యారెక్టర్, చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్నాయని, అలాంటి వ్యక్తిపై పవన్ తన ఇష్టానుసారం మాట్లాడటం సరికాదన్నారు.