'కాళ్లు పట్టుకుంటానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ?, ఢిల్లీలో వైసీపీ ఎంపీల షో'
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు శుక్రవారం నిప్పులు చెరిగారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే అందరి కాళ్లు పట్టుకొని మద్దతు కోరుతానని పవన్ చెప్పారని గుర్తు చేశారు.
అలా ప్రకటన చేసిన పవన్ కళ్యాణ్ తాము అవిశ్వాస తీర్మానం పెట్టిన తర్వాత ఏం చేశారని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏపీకి బీజేపీ నమ్మకద్రోహం చేసిందని దుయ్యబట్టారు.
ఆ రెండు పార్టీల విమర్శలు
నరేంద్ర మోడీ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చడం లేదని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. నమ్మకద్రోహం చేసిన బీజేపీ కుట్రలో రెండు పార్టీలు భాగస్వామి అయ్యాయని, ఆ రెండు పార్టీలు తమను విమర్శిస్తున్నాయని వైసీపీ, జనసేనలను ఉద్దేశించి అన్నారు.
వైసీపీ ఎంపీలు షో చేశారు
పార్లమెంటు లోపల తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆందోళనలు చేస్తూ పోరాడుతుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మాత్రం బయటకు వచ్చి షో చేశారని కళా వెంకట్రావు నిప్పులు చెరిగారు. శనివారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు అఖిల పక్ష సమావేశం జరుగుతుందని, ఈ సమావేశానికి అన్ని పార్టీలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.
తాళ్లతో అడ్డుకున్నారు
ఇదిలా ఉండగా, లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కార్యాలయం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన తెలుపుతున్నారు. వారిని మార్షల్స్ బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఆందోళన చేస్తున్న ఎంపీలను మార్షల్స్ సాయంతో బయటకు పంపేందుకు ప్రయత్నించారు. దీంతో తమ వద్దకు రాకుండా ఎంపీలు తాళ్లతో అడ్డుకున్నారు.
ఎంపీలతో చర్చలు
లోకసభ శుక్రవారం నిరవధిక వాయిదా పడినప్పటి నుంచి తమ సమస్యలను వినాలని ఎంపీలు డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకసభ సెక్రటరీ జనరల్ స్నేహలత టీడీపీ ఎంపీలతో చర్చలు జరిపారు. టీడీపీ రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, కనకమేడల, గరికపాటి, టీజీ వెంకటేష్, సీతారామలక్ష్మి తదితరులు స్పీకర్ కార్యాలయానికి వచ్చారు.