ఎప్పుడూ ప్రతీకారమేనా? చేసేదైమైనా ఉందా?: ఈగోయిజం, రౌడీయిజం అంటూ వైఎస్ జగన్పై కళావెంకట్రావు ఫైర్
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత కళా వెంకట్రావు తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా రాజధాని అమరావతిని పూర్తి చేస్తానని ఎన్నికల ముందు హామినిచ్చిన వైఎస్ జగన్ మాటలకు, చేతలకు పొంతనలేదని మండిపడ్డారు.
చీవాట్లు తిన్నా జగన్ మారడం లేదు..
పునాది దశ దాటి ఆకాశహర్మ్యాలు వెలుస్తున్న తరుణంలో.. తన ఇగోయిజం, రౌడీయిజంతో మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చి అమరావతిని చిదిమేస్తున్నారన్నారు. అమరావతి అంశంపై ప్రజల దృష్టి మరల్చేందుకే రాయలసీమలో మరోమారు కుట్ర రాజకీయాలకు తెరతీస్తున్నారని కళావెంకట్రావు సీఎం జగన్పై ధ్వజమెత్తారు. అహంకారంతో వ్యవహరించి హైకోర్టుతో చీవాట్లు తిన్నా జగన్ వైఖరిలో మార్పురావడం లేదని కళావెంకట్రావు విమర్శించారు. రాయలసీమ సమస్యలను పరిష్కరించడానికి, ఆ ప్రాంత ప్రజల అవసరాలను తీర్చేందుకు చర్యలు చేపట్టకుండా.. ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబుపై కక్ష సాధింపు...
ఈ సందర్భంగా నారావారిపల్లెలో వైసీపీ నిర్వహించనున్న బహిరంగ సభపై విమర్శలు చేశారు. చంద్రబాబుపై కక్ష సాధింపు చర్యలకు నిదర్శనంగానే వైసీపీ నేతలు ఈ సభ నిర్వహిస్తున్నారని విమర్శించారు. నారావారిపల్లెలో తాను తలపెట్టిన సభకు అనుమతి ఇవ్వకపోవడం సబబు కాదన్నారు. ప్రతీకారం చుట్టే జగన్ పరిపాలన పరిభ్రమిస్తుందని మండిపడ్డారు. ప్రతీకారంపై చూపిస్తున్న చొరవ పాలనపై చూపడం లేదన్నారు.
నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీస్ శాఖ కూడా విద్వేషాలు రెచ్చగొట్టే సభకు అనుమతిచ్చి.. ప్రజారాజధాని అమరావతికి మద్దతుగా టీడీపీ చేపట్టిన శాంతియుత నిరసనను అణిచివేయడం ద్వారా వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు. పోలీసులు పౌరులకు, చట్టానికి, వ్యవస్థకు జవాబుదారీగా ఉండాలన్నారు.
రాష్ట్రాన్ని అగ్నిగుండంలా..
అభివృద్ధి వికేంద్రీకరణ ద్వారా టీడీపీ ప్రభుత్వం నాడు ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తే.. నేడు వైసీపీ ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రగిల్చి రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తోందని విమర్శించారు. ఇదేవిధానం కొనసాగితే రాయలసీమలో ప్రాంతీయ కుంపట్లు రాజేయాలని శతవిధాలుగా ప్రయత్నిస్తున్న వైసీపీ నాయకులకూ ప్రజల చేతుల్లో చెప్పులదండలు తప్పవని హెచ్చరించారు.
కేసుల మాఫీ కోసం తప్ప.. కేంద్రం మెడలు వంచడమంటే ఇదేనా?
కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కనీస నిధులు రాబట్టలేకపోవడం వైఎస్ జగన్ ప్రభుత్వ వైఫల్యమేనని కళావెంకట్రావు ఆరోపించారు. కేంద్రం తమ చెప్పుచేతల్లో ఉందని ప్రగల్బాలు పలికిన ఏ1, ఏ2ల డొల్లతనం దీంతో బట్టబయలైందని విమర్శించారు. జగన్, విజయసాయిరెడ్డి.. 8 నెలల నుంచి కేసుల మాఫీ, స్వప్రయోజనాల కోసం తప్ప ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడలేదని మండిపడ్డారు. పోలవరానికి కూడా ఒక్క రూపాయి నిధులు రప్పించుకోలేకపోయారని ధ్వజమెత్తారు. 22 మంది ఎంపీలను ఉంచుకుని కేంద్రం మెడలు వంచడమంటే ఇదేనా? అని కళావెంకట్రావు వెల్లడించారు.