జగన్ ప్రవర్తనపై కళా ఘాటు వ్యాఖ్య, సాయి ప్రతాప్ని వైసిపి పట్టించుకోలేదా?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రవర్తన బాగాలేదని, అలాగే అతనికి దిశా నిర్దేశనం లేదని గురువారం అన్నారు.
త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావడం ఖాయమన్నారు. వైసిపి ప్రజల కోసం పెట్టింది కాదని, జగన్ కోసం పెట్టిందేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి సాయి ప్రతాప్ టిడిపిలో చేరారని చెప్పారు. ఏపీని విభజించవద్దని సాయి ప్రతాప్ నాడు గట్టిగా కోరారని చెప్పారు.
రాయలసీమ అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకే ఆయన చేరారని చెప్పారు. మంత్రి గంటా శ్రీనివాస రావు వేరుగా మాట్లాడుతూ.. జగన్కు చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబు కష్టపడి పని చేసే వ్యక్తి అన్నారు.
సాయి ప్రతాప్ను జగన్ పట్టించుకోలేదా?
మాజీ కేంద్రమంత్రి సాయి ప్రతాప్ గురువారం ఉదయం టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ప్రజలు, అభిమానుల సూచన మేరకే టిడిపిలో చేరానని చెప్పారు. వైసిపిలోకి తనను ఆహ్వానించారన్న వ్యాఖ్యలు అవాస్తవమని చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డికి సాయి ప్రతాప్ చాలా దగ్గరగా ఉండేవారు. వైయస్ హయాంలోనే సాయి ప్రతాప్ కేంద్రమంత్రి అయ్యారు. ఇలాంటి సాయి ప్రతాప్ను జగన్ పట్టించుకోలేదనే వాదనలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయన.. తనను వైసిపి ఆహ్వానించలేదని చెప్పడం గమనార్హం.