సీట్ల కోసం రవి ఇంట్లో జగన్తో పవన్ భేటీ, ఆయనింట్లో చిరంజీవి ఎందుకున్నారు: కళా 19 ప్రశ్నలు
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి కళా వెంకట్రావు ఆదివారం బహిరంగ లేఖ రాశారు. 19 ప్రశ్నలతో ఈ బహిరంగ లేఖను విడుదల చేశారు. నవ్యాంధ్ర ప్రదేశ్కు ద్రోహం చేసిన బీజేపీని, ప్రధాని నరేంద్ర మోడీని వదిలేసి తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు ఎందుకు చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు.
చంద్రబాబు చాలా తెలివైనవారు: కిరణ్ కుమార్ రెడ్డి, పవన్ కళ్యాణ్కు బొత్స గట్టి కౌంటర్
బీజేపీకి జనసేనాని ఎందుకు భుజం కాస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ల మధ్య ఉన్న చీకటి ఒప్పందే ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన నిధులను కేంద్రం వెనక్కి తీసుకుందని, దానిపై తాము నిలదీస్తున్నానని, జనసేనాని ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు.
వీటిపై నిలదీయడం లేదేం
కేంద్ర ప్రభుత్వంలో జరిగిన రాఫెల్ డీల్ కుంభకోణం పైన పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని కళా వెంకట్రావు ప్రశ్నించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నమ్మకద్రోహం చేసినా బీజేపీకి కొమ్ముకాస్తున్నారని విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.75వేల కోట్లు రావాలని పవన్ కళ్యాణ్ గతంలో వేసిన జేఎఫ్సీ నిర్ధారించిందని గుర్తు చేసారు. ఈ విషయంపై కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్నారని తెలిపారు. దీనిని నిలదీయాలను సూచించారు.
Recommended Video
ఆయనింట్లో చిరంజీవి ఎందుకు ఉన్నారో చెప్పాలి
కాకినాడ సీ పోర్టు పైన పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం విడ్డూరమని కళా వెంకట్రావు అన్నారు. సీ పోర్టు అధినేత ఇంట్లో మీ సోదరుడు చిరంజీవి ఎందుకు ఉన్నారో చెప్పాలని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఏనాడు కూడా నిజాయితీ, నిబద్దతతో పని చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలోని యువత, బడుగు, బలహీనవర్గాల కోసం పాటుపడుతున్న చంద్రబాబుపై విమర్శలు చేస్తారా అన్నారు. బీజేపీ హిందుత్వ పార్టీ కాదని పవన్ చెప్పడాన్ని కళా తప్పుబట్టారు.
మీ అన్నయ్యనే గెలిపించలేదు, 2014లో టీడీపీని గెలిపించావా?
2009 ఎన్నికల్లో నాడు ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఉన్న మీ అన్నయ్య చిరంజీవితో పాటు అల్లు అరవింద్ను ఎన్నికల్లో గెలిపించుకోలేని పవన్, 2014లో టీడీపీని ఏ విధంగా గెలిపించాడో చెప్పాలని కళా ప్రశ్నించారు. బాక్సైట్ సహా ఇతర గనులకు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో అనుమతులు వచ్చాయని చెప్పారు. అయినా పవన్ మౌనం వహించారని విమర్శించారు. ప్రసంగాల్లో పరుష పదజాలం వాడుతూ యువతకు ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు.
యలమంచిలి ఇంట్లో జగన్తో భేటీ, 40 సీట్లు అడగలేదా?
విశాఖపట్నంలో యలమంచిలి రవి ఇంట్లో జగన్తో పవన్ కళ్యాణ్ రహస్యంగా సమావేశం అయ్యారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో 40 సీట్లు కావాలని జగన్ను కోరిన మాట వాస్తవం కాదా చెప్పాలని డిమాండ్ చేశారు. జనసేన పోరాటయాత్ర పేరుతో ఏసీ బోగీల్లో కూర్చున్న పవన్ కళ్యాణ్ సాధారణ పౌరులను ఎలా కలిశారో చెప్పాలన్నారు. రాఫెల్తో పాటు జీఎస్టీ, నోట్ల రద్దు, సీబీఐ వేధింపులు, ఐటీ దాడులపై పవన్ స్పందించాలని హితవు పలికారు.