అవినీతిలో భార్యను భాగస్వామి చేశావు! మొసలికన్నీరెందుకు?: జగన్పై కళా నిప్పులు
అమరావతి: అక్రమాస్తుల కేసు ఛార్జ్షీటులో వైయస్ భారతి పేరును ఈడీ చేర్చడానికి.. టీడీపీకి సంబంధం ఉందంటూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఏపీ మంత్రి కళా వెంకట్రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈడీకి, టీడీపీకి సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఇలా భారతిని విముక్తిని చెయ్
అక్రమాస్తులన్నింటినీ పేదలకు పంచి, భారతిని కేసుల నుంచి విముక్తి చేయాలని జగన్కు కళా వెంకట్రావు సూచించారు. ఈ మేరకు జగన్కు ఆయన లేఖ రాశారు. ఆరు పేజీల లేఖలో జగన్కు 23 ప్రశ్నలను కళా వెంకట్రావు సంధించారు.
అవినీతిలో భార్యను భాగస్వామి చేశారు..
అవినీతిలో భార్యను భాగస్వామిని చేసి.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ జగన్పై కళా వెంకట్రావు మండిపడ్డారు. అవినీతి ఆస్తిని భార్య పేరుపై ఎందుకు పెట్టారంటూ లేఖలో కళా వెంకట్రావు ప్రశ్నించారు. అవినీతి కేసులో భారతి పేరు నమోదైతే, టీడీపీకి ఏం సంబంధమని నిలదీశారు.
ఆ రెండు పార్టీలతో జగన్ లాలూచీ..
అక్రమాస్తుల కేసులో కాంగ్రెస్ పార్టీతో లాలూచీ పడి బెయిల్ తెచ్చుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు అక్రమాస్తుల కేసు నత్తనడకన నడుస్తున్నదానికి బీజేపీతో లాలూచీ కారణం కాదా? అని అన్నారు. బీజేపీతో ఉన్న లాలూచీ వల్లే వైసీపీ ఎంపీలు అవిశ్వాసానికి ముందే రాజీనామాలను ఆమోదించుకున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
బీజేపీకి లబ్ధి చేకూరేలా..
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీతో లాలూచీ పడ్డారని మండిపడ్డారు. రాజ్యసభ సభ్యులను గైర్హాజరు చేయించి, బీజేపీకి లబ్ధి కలిగేలా చేశారని విమర్శించారు. జగన్ మీ అవినీతి కేసుల్లో ఐఏఎస్ అధికారులు కూడా చార్జిషీట్లను ఎదుర్కొన్న విషయం నిజం కాదా? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు.