2 కోట్లు లంచం ఇవ్వజూపారు: కళానికేతన్ యాజమాన్యంపై ధర్మవరం ఎమ్మెల్యే
అమరావతి: చేనేత కార్మికులను నిండా ముంచి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కళానికేతన్ కేసులో దర్యాప్తును పోలీసులు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సంస్ధ డైరెక్టర్ లక్ష్మీశారదతో పాటు ఎండీ లీలా కుమార్ను అనంతపురం జిల్లా ధర్మవరం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు.
సంస్ధ ఎండీ లీలా కుమార్ను హైదరాబద్లో అరెస్ట్ చేసిన పోలీసులు సోమవారం అనంతపురానికి తీసుకొచ్చారు. ఆయనను ఎక్కడ ఉంచిందీ బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటూ విచారణ చేస్తున్నట్లు తెలిసింది. గత ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న లీలా కుమార్ ఆచూకీని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కనుగొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
కళానికేతన్ డైరెక్టర్ నుంచి కీలక సమాచారం, ఎండీకి బిగుస్తున్న ఉచ్చు
అయితే తనను గుర్తుపట్టకుండా ఉండేందుకు లీలాకుమార్ గుండు చేయించుకున్నా.. పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయారు. 'ఆపరేషన్ కే'గా వ్యవహరిస్తున్న ఈ కేసు దర్యాప్తునకు మరికొందరు పోలీసు అధికారులను నియమించినట్లుగా తెలిసింది. వాస్తవానికి ధర్మవరంలో కళానికేతన్ సంస్ధ కొనుగోలు చేసిన పట్టు చీరలను మరో సంస్ధకు మళ్లించినట్లు పోలీసులకు సమాచారం అందించింది.
ఈ నేపథ్యంలో ఆయన విచారణ ముగిసే వరకు మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం లేదని అంటున్నారు. ధర్మవరం చేనేత కార్మికుల వద్ద రూ. 9.36 కోట్ల విలువైన చీరలను కొనుగోలు చేసి బాకీ తీర్చలేదని ధర్మవరంలోని చేనేత కార్మికులు కళానికేతన్ యాజమాన్యంపై కేసు పెట్టిన సంగతి తెలిసిందే.
మరోవైపు కళానికేతన్ సంస్ధ లావాదేవీలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే లీలాకుమార్పై ధర్మవరం పోలీస్ స్టేషన్లో 13 కేసులు నమోదయ్యాయి. కేసు విచారణలో భాగంగా పోలీసులకు అవాక్కయ్యే వాస్తవాలు బయటకొస్తున్నాయి. తాజాగా ఈ కేసు నుంచి బయటపడేందుకు కళానికేతన్ యాజమాన్యం దుర్మార్గమైన చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఈ కేసు నుంచి తప్పించాలంటూ ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణను సంస్ధ యాజమాన్యం ఆశ్రయించింది. చేనేత కార్మికులకు చెల్లిచేందుకు తమ వద్ద డబ్బులు లేవని ఆయనతో చెప్పిన యాజమాన్యం తమను కేసు నుంచి బయటపడేస్తే రూ. 2 కోట్లు లంచం ఇస్తామంటూ ఎమ్మెల్యేకు ఆశచూపించారట. అయితే కళానికేతన్ సంస్ధ ప్రతిపాదనను ఎమ్మెల్యే తిరస్కరించారని సమాచారం.
బాత్రూంలో దాక్కున్న కళానికేతన్ ఎండీ శారద: తలుపులు పగులగొట్టి అరెస్ట్
అంతేకాదు తనకే లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఆయన ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలిసి తనను సంప్రదించిన మీడియాతో కూడా ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ వాస్తవాన్ని వెల్లడించారు. తనకు కళానికేతన్ రూ.2 కోట్ల మేర లంచం ఇచ్చేందుకు సిద్ధమైన మాట వాస్తవమేనని ఆయన చెప్పారు.
ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన కళానికేతన్ డైరెక్టర్ లక్ష్మీశారదను ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విచారణలో వారు కీలక సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కళానికేతన్ సంస్థ రూ.65 కోట్లు బకాయి ఉన్నట్టు సమాచారం.