ఘాటుగా, జగన్ క్షమాపణ చెప్పాలి: కాల్వ, జగన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్: కోడెల
హైదరాబాద్: మేం ఎవరితో మాట్లాడుతున్నామో అర్థం కావడం లేదని వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ సోమవారం అన్నారు. శాసన సభ మొదటిసారి వాయిదా పడిన అనంతరం తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సభాపతి కోడెల శివప్రసాద్, జగన్ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది.
ప్రత్యేక హోదా పైన తీర్మానం చేయాలని వైసిపి పట్టుబట్టింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ముఖ్య అంశాలను ప్రభుత్వం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని, చర్చ జరగవద్దనే ఉద్దేశ్యంతో అధికార పార్టీ ప్రశ్నోత్తరాలు అంటున్నారన్నారు.
12గంటల తర్వాత ఎప్పుడైనా ప్రశ్నోత్తరాలు జరిగాయా అన్నారు. ప్రత్యేక హోదా గురించి చర్చ అని డిమాండ్ చేస్తే.. ప్రశ్నోత్తరాలు అనడం ఏమిటన్నారు. హోదా పైన చర్చ జరగవద్దా అన్నారు. ఇలా సభను నడుపుతుంటే ఎలా అన్నారు. ప్రజా సమస్యలను పక్కదోవ పట్టిస్తే ఎలా అన్నారు.
చంద్రబాబుకు పదిహేను నిమిషాలు మాట్లాడే సమయం ఇచ్చారని, మేం అసలు మీతో మాట్లాడుతున్నామా లేక చంద్రబాబుతో మాట్లాడుతున్నామో అర్థం కావడం లేదని కోడెలను ఉద్దేశించి అన్నారు. బాబు మాట్లాడే మాటలు మీరు మాట్లాడుతున్నారన్నారు. సభ జరిగేది 5 నిమిషాలేనని, తీర్మానం అంటే ప్రశ్నోత్తరాలేంటన్నారు.
జగన్ మీ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తే ఏం చేయలేను: కోడెల
జగన్ మీ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తే ఏం చేయలేనని సభాపతి కోడెల అన్నారు. నేను 30 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నానని అయితే, ఇలాంటి సంతాప సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయలేదన్నారు. అలాగే, సభాపతి పైన ఇలాంటి బాధాకర వ్యాఖ్యలు ఇప్పటి వరకు ఎవరూ చేయలేదన్నారు.
ప్రశ్నోత్తరాలు కావాలని రెండు పార్టీలు అడుగుతున్నాయని, మీరు చర్చ అడుగుతున్నారన్నారు. జగన్ అదే పనిగా మాట్లాడుకుంటూ పోతుండగా.. ఓ సమయంలో జగన్ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అని సభాపతి అన్నారు.
రాజకీయ ప్రయోజనాలు వద్దు: కాల్వ శ్రీనివాసులు
జగన్ ప్రజాప్రయోజనాలు కాకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాట్లాడుతున్నారని కాల్వ శ్రీనివాసులు అన్నారు. అధ్యక్ష పదవిని గౌరవించకుండా మాట్లాడుతున్నారని, వెంటనే జగన్ క్షమాపణ చెప్పాలన్నారు. అధ్యక్షుడిని విమర్శించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మీది సరికాదన్నారు.
అధ్యక్ష స్థానం పైన అమర్యాదగా మాట్లాడితే మిమ్మల్ని మీరే కించపర్చుకున్నట్లు అన్నారు. మీ ఆలోచన మార్చుకోవాలని జగన్ కు కాల్వ హితవు పలికారు. ఈ సభలో ప్రతి అంశాన్ని చర్చించేందుకు తాము సిద్ధమని చెప్పారు. అజెండా ప్రకారం సభ నడుస్తుందన్నారు. సభలో రచ్చ చేసి సమయాన్ని వృథా చేయవద్దన్నారు.
బిఎసిలో మేం అన్నింటికి అంగీకరించలేదు: జ్యోతుల
బిఎసిలో మేం అన్నింటికి అంగీకరించామని చెప్పడం సరికాదని జ్యోతుల నెహ్రూ అన్నారు. గోదావరి పుష్కరాల సమయంలో భక్తులు ఏ రకంగా చనిపోయారు, కారణం ఏమిటో చర్చించాలన్నారు.
ఎవరి ప్రేరణతో జరిగిందో చెప్పే ప్రయత్నం తప్ప తాము ఎవరి పైన రుద్దాలని దురాలోచనతో మాట్లాడలేదన్నారు. పన్నెండు తర్వాత ప్రశ్నోత్తరాలు ఎప్పుడూ చేపట్టలేదన్నారు. ప్రత్యేక హోదా పైన తీర్మానం చేయాలంటే ప్రభుత్వం ససేమీరా అంటోందన్నారు. ప్రజా సమస్యలను బిఎసిలో కోరామన్నారు. కాగా, శాసన సభ రెండోసారి వాయిదా పడింది.