నమ్మకండి.. చంద్రబాబు చాలా ప్రమాదకారి: చెన్నైలో పవన్ కళ్యాణ్, జగన్ పైనా
చెన్నై: తాను 2014లో జనసేన పార్టీని స్థాపించానని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ ఆవిర్భవించిందని చెప్పారు. దేశాన్ని ఉత్తరప్రదేశ్, బీహార్ రాజకీయాలు శాసిస్తున్నాయని చెప్పారు. తాను గత కొన్నాళ్లుగా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నానని చెప్పారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్, బీజేపీలో కారణమని చెప్పారు.
అప్పుడు చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశం: రాహుల్ గాంధీకి మాజీ కాంగ్రెస్ నేత ఝలక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ మాట మార్చిందని చెప్పారు. అనుభవం ఉన్న నాయకత్వం అవసరమని భావించి 2014లో ఏపీలో టీడీపీకి మద్దతు పలికామని చెప్పారు. తమిళనాడు నుంచి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏపీ ఏర్పడిందని, తెలంగాణ ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిందని చెప్పారు. ఆయన చెన్నైలో కమల్ హాసన్ను కలిశారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
దక్షిణాదికి రెండో రాజధాని
అనుభవం కలిగిన నేతలు కావాలని చంద్రబాబుకు మద్దతు ఇస్తే, ఏపీలో తెలుగుదేశం పార్టీ పాలనలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని పవన్ కళ్యాణ్ అన్నారు. పెద్ద నోట్ల రద్దును ప్రజలు వ్యతిరేకించారని చెప్పారు. దక్షిణాదికి రెండో రాజధాని ఉండాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారని గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేతను రహస్యంగా కలిశారని ఆరోపణలు రావడంపై స్పందించేందుకు పవన్ నిరాకరించారు. వాటిని సిల్లీ ఆరోపణలుగా అభిప్రాయపడ్డారు.
జనసేన మాత్రమే ఏపీని సరైన దిశలో నడిపిస్తుంది
చంద్రబాబు పదవీ విరమణ వయసుకు చేరుకున్నారని, పంచాయతీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని తన కొడుకు నారా లోకేష్ను పంచాయతీరాజ్ మంత్రిగా చేశారని పవన్ మండిపడ్డారు. ఏపీ భవిష్యత్తు జనసేన చేతిలో ఉందని, జనసేన మాత్రమే రాష్ట్రాన్ని సరైన దిశగా నడిపిస్తుందని చెప్పారు.
సినిమా సెట్లను తగులబెట్టారు
తెలుగు ప్రజలు అయినప్పటికీ అక్కడి (సమైక్య ఏపీ) ప్రజల మధ్య విద్వేషాలు నెలకొన్నాయని, దీనికి కారణం ప్రజలు కాదని, రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు అని పవన్ చెప్పారు. పది సంవత్సరాల క్రితం ఏపీ ప్రజలను తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ నాయకులు ద్వితీయశ్రేణి పౌరులుగా చూసేవారని, సినిమా సెట్లను తగులబెట్టారని, ఎన్నో వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయన్నారు. క్రమపద్ధతి లేని విభజన వల్ల ఏపీ చాలా కోల్పోయిందన్నారు.
ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ పోరాటం
అంతకుముందు ప్రజారాజ్యం నుంచి రాజకీయ పోరాటం చేశానని, అప్పుడు 18 సీట్లు విజయం సాధించామని, మొత్తంగా చూసుకుంటే దాదాపు 23 శాతం ఓట్లు ప్రస్తుత ఏపీలో వచ్చాయని పవన్ చెప్పారు. విభజన తీరు వల్ల ప్రజల కోసం పార్టీ పెట్టినప్పటికీ, అప్పటి రాజకీయ పరిస్థితుల వలన అనుభవజ్ఞుడు కావాలని చంద్రబాబుకు పోటీ చేసి, తాము పోటీ చేయలేదన్నరు. కానీ వారు అవినీతికి పాల్పడ్డారన్నారు.
విభజనతో ఏపీకి అన్యాయం
విభజన రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని, మోడీ, బీజేపీలు జవాబుదారీతనంతో పని చేయాలని, ఏపీకి ఇచ్చిన హామీలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉందని పవన్ అన్నారు. యూపీ దేశ రాజకీయాలను శాసిస్తుంటే దక్షిణాదికి జరుగుతున్న అన్యాయంపై ఎవరు మాట్లాడుతారని, అందుకే రెండో రాజధాని అవసరమన్నారు. ముందుగా అన్ని రాష్ట్రాల్లో తిరిగి జనసేన సిద్ధాంతాలు తెలియజేయాలని అనుకుంటున్నానని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు ఏకమైతే కేంద్రం నుంచి సరైన ప్రతిఫలాలను పొందవచ్చునని చెప్పారు.
అలా నవ్వకండి.. చంద్రబాబుపై చెన్నైలో పవన్ సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు చాలా గొప్పమనిషి అని పవన్ ఎద్దేవా చేశారు. ఆ సమయంలో పలువురు నవ్వారు. పవన్ మాట్లాడుతూ.. మీరు అలా నవ్వకండని, ఆయనకి ఈరోజు స్నేహితుడిగా ఉన్నవాడు రేపు బద్ధ శత్రువు అవుతాడని, ఆయనను ఎవరు నమ్మకూడదని చెప్పారు. చంద్రబాబు చెప్పే మహాకూటమితో ఎవరు పొత్తు పెట్టుకున్నా భవిష్యత్తులో ఆయన వారిని చాలా దారుణంగా మోసం చేస్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అన్నారు. చంద్రబాబు ప్రమాదకరం కాబట్టి మూడో ప్రత్యామ్నాయం దిశగా జనసేన పని చేస్తోందని చెప్పారు.
జగన్ పైనా విమర్శలు
వైసీపీతో జనసేన పొత్తు ఎందుకు పెట్టుకుంటుందని, వారి అవినీతి, చేతకానితనం గురించి రోజు విమర్శిస్తున్నానని పవన్ అన్నారు. వారితో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నానని టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని తాను పట్టించుకోనని అన్నారు. 2019లో పోటీకి దిగుతున్నామని పవన్ చెప్పారు. బీజేపీ, వైసీపీ లాంటి పార్టీలతో పొత్తు ఉండదని చెప్పారు. 2019లో ఏపీలో 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. జగన్ లాంటి వ్యక్తులు కేసులకు భయపడి కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్నారు.