విభజనపై సుప్రీం: కమల్ స్పందన, కెసిఆర్పై పొంగులేటి
చిత్తూరు/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు నుండి నోటీసులు రాగానే కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేస్తుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ శుక్రవారం అన్నారు. ఆయన చిత్తూరు జిల్లా తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు.
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రభావం ప్రజల్లో ఏమాత్రం లేదని, కేవలం మీడియాకే పరిమితం అయిందన్నారు. సుస్థిర పాలన అందించే కాంగ్రెసు పార్టీకే ప్రజలు ఓటు వేసి గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కెసిఆర్ గందరగోళ పరుస్తున్నారు: పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజలను గందరగోళ పరుస్తున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి శుక్రవారం అన్నారు. ఓ వైపు పొత్తులు అంటూనే మరోవైపు తాజా మాజీ మంత్రిపై అభ్యర్థిని ప్రకటించడమేమిటన్నారు. తమకు పదవులు అవసరం లేదని, నీతివంతమైన, సమర్థవంతమైన పాలన కావాలన్నారు.
తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఆమోస్ అధ్యక్షతన సమన్వయ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాల కోసం మరో ఐదుగురితో కూడిన సబ్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పోలవరం డిజైన్ మార్చాలని, ఏడు మండలాలని తెలంగాణలోనే ఉంచాలని సోనియాకు లేఖ రాస్తామన్నారు.
కెసిఆర్ తీరు సరికాదు: నాగం
తన వల్లనే తెలంగాణ వచ్చిందని కెసిఆర్ చెప్పడం సరికాదని బిజెపి నేత నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. విద్యార్థులు, అన్ని వర్గాల వారు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చిందన్నారు.