శ్రావణ శుక్రవారం..ఆవుల మృతి కలచివేసింది: గోశాలను సందర్శించిన పీఠాధిపతులు
అమరావతి: మహాలక్ష్మితో సమానంగా ఆవును పూజించే పవిత్ర శ్రావణ మాసంలో వందకుపైగా గోవులు మృత్యువాత పడటాన్ని పలువురు పీఠాధిపతులు, స్వామీజీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగ్భ్రాంతికి గురయ్యారు. కారణాలు ఏమైనప్పటికీ- శ్రావణమాసంలో ఇలాంటి ఘోర దుర్ఘటన చోటు చేసుకోవడం తమను కలిచి వేస్తోందని అన్నారు. ఈ ఘటన రాష్ట్రానికి శుభసూచకం కాదని వారు ఆందళనగా చెబుతున్నారు. భువనేశ్వరి మఠం పీఠాధిపతి కమలానంద భారతీ స్వామి ఆదివారం గోశాలను సందర్శించారు. ఆ సమయంలో కమలానంద భారతీస్వామి వెంట పలువురు విశ్వహిందూ పరిషత్ ప్రతనిధులు ఉన్నారు.
విజయవాడ శివార్లలో కొత్తూరు-తాడేపల్లి సమీపంలోని గోసంరక్షణ సంఘం నిర్వహిస్తోన్న గోశాలను వారు తిలకించారు. ఈ ఘటన ఎలా జరిగిందంటూ- నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. పశుగ్రాసాన్ని నిల్వ ఉంచిన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. గోశాలలో జరిగిన సంఘటన హృదయాన్ని కలచివేసిందని అన్నారు. ఇలాంటి దుర్ఘటనలు మళ్లీ, మళ్లీ చోటు చేసుకోకూడని అన్నారు. గోశాలల నిర్వహణపై ప్రభుత్వం ఇకనైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహాలక్ష్మితో సమానమైన మూగప్రాణులు ప్రాణాలు కోల్పోవడం సహజం కాదని అన్నారు. ఖననం చేసిన గోమాతలకు శాంతి పూజలు చేయించాలని కమలానంద భారతీస్వామి నిర్వాహకులకు సూచించారు.
మరోవంక- ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శివస్వామి ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శ్రావణమాసం శుక్రవారం నాడు ఆవులు మరణించడం రాష్ట్రానికి అరిష్టమని అన్నారు. ఈ ఘటన వెనుక గల కారణాలను అన్వేషించాలని ఆయన ప్రభుత్వానికి డిామాండ్ చేశారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని అన్నారు. ఒకటి, రెండు ఆవులు అకారణంగా కన్నుమూస్తేనే మనం బాధతో విలవిల్లాడిపోతామని, అలాంటిది ఏకంగా వందకు పైగా ఆవులు చనిపోవడం అనేది హృదయ విదారక ఘటన అని అన్నారు. ఆశించిన స్థాయిలో నిర్వహణ లేని, సామర్థ్యం లేని గోశాలలో 1500 పైగా ఆవులను ఉంచాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ఆయన నిర్వాహకులను ప్రశ్నించారు.